మదనపల్లె టౌన్ : మదనపల్లె మద్యం షాపుల్లో యుకులపై దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. స్థానిక దేవతా నగర్ మద్యం షాపులో ఇటీవల ఓ కానిస్టేబుల్ భర్తపై పలువురు యువకులు మద్యం తాగేందుకు వచ్చి కర్రతో కొట్టి హత్యాత్నానికి పాల్పడిన ఘటన మరవకనే సీటీఎం రోడ్డులోని దాము వైన్స్లో మరో సంఘటన శనివారం అర్థరాత్రి జరిగింది. దీంతో పట్టణ ప్రజలు త్రీవ్ర భయాందోళన చెందుతున్నారు. దాడి ఘటనపై టూ టౌన్ పోలీసులు ఆదివారం తెలిపిన వివరాలు.. పట్టణంలోని రెడ్డీస్ కాలనీకి చెందిన శివసాయి (27) దాము వైన్స్లో మందు తాడానికి రాత్రి వెళ్లాడు. పర్మిట్ రూములో కూర్చోని మద్యం తాగుతుండగా, సుమారు 15 మంది యువకులు కలసి వచ్చి బీరుబాటిళల్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శివసాయిని స్థానికులు గమనించి చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు శివసాయికి మెరుగైన వైద్యం అందించి, తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే తిరుపతికి తరలించాలని సూచించారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడికి గల కారణాలపై ఆరాతీశారు. అనంతరం దాము వైన్స్ వద్దకు వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే సీసీ కెమెరాల్లో ఎలాంటి డేటా లేకుండా తారుమారు చేసినట్లు తెలసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నా మన్నారు.
ఆటో ఢీకొని యువకునికి..
మదనపల్లె టౌన్ : ఆటో ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడి నంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూక పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, బోయకొండకు చెందిన హరిబాబు నాయుడు(30) సొంత పనిమీద బైకులో మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా వలసపల్లె వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న ఆటో హరిబాబు నాయుడు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు 108 వాహనంలో మదన పల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు బాధితునికి ప్రథమ చికిత్సలు అందించి, అతనికి మెరుగైన వైద్యం అవసరం ఉందని తిరుపతికి వెళ్లాని రెఫర్ చేశారు. కుటుంబీకులు బాధితున్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
మందు తాగడానికి వచ్చిన
యువకుడిపై 15మంది దాడి


