ఇలా అధికారం!
అలా సభ్యత్వం..
మదనపల్లె: మదనపల్లె పట్టణం నడిబొడ్డున రూ.కోట్ల ఆస్తులు కలిగిన ది మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘం ఎన్నికలు నిబంధనల మేరకు జరగలేదన్న వాదన వినిపిస్తోంది. న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నిక నిర్వహించామని సహకారశాఖ అధికారులు చెబుతుండగా పోటీ చేయాల్సిన సభ్యుల అర్హతకు సంబంధించిన నిబంధన పాటించలేదన్న చర్చ సాగుతోంది. అగస్టులో సభ్యత్వం పొందిన సభ్యులు నామినేషన్లు వేయడం ఎన్నిక కావడం, దశాబ్దాల తరబడి సభ్యులుగా ఉన్నవారు ఈఎన్నికలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. 2017 తర్వాత ఈ సొసైటీకి ఈనెల 22న ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలుపెట్టగా 29న ఎన్నిక నిర్వహించాలి. ఒక నామినేషన్ ఉపసంహరణతో బి.మహేష్కుమార్, ఎన్.రెడ్డెప్ప, కే.వీరవెంకట శివాజి, బి.శివానందనాయక్, కే.వెంకటాచలపతి, ఎస్.రెడ్డి షంషీర్, యు.నరేష్లు మాత్రమే బరిలో నిలవడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు శుక్రవారం ఎన్నికల అధికారి ప్రకటించారు. శనివారం స్థానిక సహకారశాఖ కార్యాలయంలో చైర్మన్గా రెడ్డి షంషీర్ వైస్ చైర్మన్గా రెడ్డెప్ప, కార్యదర్శిగా మహేష్లను సభ్యులు ఎన్నుకున్నారు.
● సహకార సంఘాలకు సంబంధించి ఏవరైనా సభ్యత్వం తీసుకుంటే వారు ఏడాది లేదా ఆపై వరకు ఆ సంఘ కార్యవర్గ ఎన్నికలో పోటీ చేయడానికి లేదని సహకారశాఖ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు సొస్టెటీకి ఎన్నికై న ఏడుగురు గడచిన ఆగస్టులో..రెండునెలల క్రితం సభ్యత్వం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. వీరికి ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వడం చర్చనీయాంశమైంది.
● సొసైటీలో 238 మంది సభ్యులు ఉన్నట్టు ఎన్నికల అధికారి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. వీరిలో 50ఏళ్ల నుంచి సభ్యులుగా ఉన్నవాళ్లు ఉన్నారు. వారికి గుర్తింపుకార్డుల జారీ, లేదా ఎన్నికల నిర్వహణపై సభ్యులకు సమాచారం ఇచ్చారా లేదా అన్నది తెలియడం లేదు. ఈ ఎన్నికకు సొసైటీ సీనియర్ సభ్యులు ఒక్కరైనా పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.
● సొసైటీకి సంబంధించి గత ఎన్నికలు జరిగిన 2017 తర్వాత ప్రస్తుతం ఎన్నిక జరిగింది. సొసైటీ నిర్వహణ రికార్డులు, ఆస్తుల వివరాలు తమవద్ద లేవని సహకారశాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికలేకపోవడంతో ఇప్పటిదాకా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ పర్సన్ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆ రికార్డులు ఎవరివద్ద ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్నదానికి ఎవరి నుంచి సమాధానం లేదని అంటున్నారు. దాంతో కొత్త పాలకవర్గానికి పాలన వ్యవహారం ఆంతా ఈజీగా లేదు.
పోటీకి ఏడాది గడువునిబంధన అవసరఽం లేదట
రూ.కోట్ల విలువైన ఆస్తులున్న సొసైటీ రికార్టులు లేవంటున్న అధికారులు


