
మాటలు వద్దు.. పరిహారం ఇవ్వండి
రైల్వేకోడూరు అర్బన్ : పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువుకట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గిరిజన కూలీలకు ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా మాటలు చెబితే సరిపోతుందా అని జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు సిహెచ్.చంద్రశేఖర్ ప్రశ్నించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలను బుధవారం ఆయన పరార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతిచెంది నాలుగు రోజులైనప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించలేదన్నారు. గిరిజనులు, యానాదుల పట్ల వివక్షత చూపుతున్నారని విమర్శించారు. ఈ నెల 21న కోడూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి, నియోజకవర్గ కూటమి నాయకులు పరామర్శించినప్పటికీ ఏ ఒక్కరూ గిరిజనులను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ. 10 లక్షలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.