
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
సిద్దవటం : మండలంలోని సాబ్బావి రహదారి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా.. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడాల వెంకట శ్యాంప్రసాద్ తన సొంత కారులో రాష్ట్ర నాయకుడు పట్టెడ రమణను ఎక్కించుకొని కడప ప్రెస్క్లబ్లో సమావేశానికి బయలుదేరారు. మండలంలోని సాబ్బావి రహదారి సమీపంలోకి రాగానే కల్వర్ట్ను ఢీకొని కారు మూడు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని దార వెంట ప్రయాణికులు 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లి పంచాయతీ శాంతినగర్లోని కడప–తిరుపతి ప్రధాన రహదారిపై బుధవారం విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్కు చెందిన వారు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం కుప్పకూలడంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు