డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

May 31 2025 1:37 AM | Updated on May 31 2025 1:39 AM

రాయచోటి: అన్నమయ్య జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫిరెన్సు హాల్‌లో నేషనల్‌ నారోటిక్స్‌ కో–ఆర్డినేషన్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముందుగా జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి అజెండా అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమావేశంలో వివరించారు. ప్రధానంగా మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లాలో తీసుకోవాల్సిన అంశాలను కమిటీలో వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అలవాటుకు ఎవరూ బానిసలు కారాదని, ముఖ్యంగా యువత మేలుకొని డ్రగ్స్‌ను వదులుకోవాలని, తమ భవిష్యత్తును మంచిగా మలుచుకోవాలని కలెక్టర్‌ సూచించారు. వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, విద్య, అటవీ , డ్రగ్‌ తదితర శాఖల అధికారులందరూ పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకొని మాదక ద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. డిగ్రీ, ఇంటర్మీడియట్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌, ఎంఈఓలతో అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేసి చెప్పేలా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు.

300 కిలోల గంజాయి స్వాధీనం

జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదనపల్లి డివిజన్లలో 2024, 2025లో ఇప్పటి వరకు మొత్తం 26 డ్రగ్స్‌ కేసులను రిజిస్టర్‌ చేసి సుమారు 300 కిలోల గంజాయి పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి తెలిపారు. అలాగే 40 మంది నిందితులను గుర్తించామన్నారు. 11 మంది రిటైలర్లు, 20 మంది సెల్లర్స్‌, 99 మంది వినియోగదారులను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్లు 1972, 1933 లేదా 7382296118కు ఎవరైనా ఫోన్‌ చేసి సమాచారం తెలపవచ్చన్నారు. అనంతరం అధికారులతో కలిసి డ్రగ్స్‌, గంజాయి నివారణ టోల్‌ ఫ్రీ నెంబర్లపైప్రచార కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌, ఆర్డీఓ శ్రీనివాస్‌, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి మధుసూదన్‌, అటవీ, వైద్య, విద్య, డ్రగ్స్‌ కంట్రోల్‌, వివిధ శాఖల అధికారులు, ఐటిఐ, పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పీఎం సూర్యఘర్‌ రిజిస్ట్రేషన్స్‌ పెంచాలి

జిల్లాలో పీఎం సూర్యఘర్‌ రిజిస్ట్రేషన్స్‌ పెంచాలని కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ ఏపీ సచివాలయంలోని సీఎస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి యోగాంధ్ర–2025 క్యాంపెయిన్‌, పీఎం సూర్యఘర్‌ సానుకూల ప్రజా అవగాహన తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జేసీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫిరెన్సు అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్స్‌ ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 51 వేల మంది రిజిస్టర్‌ కాగా ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని పేర్కొన్నారు. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ సూచించారు. నిత్యం యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, ప్రజలు నిత్య జీవితంలో యోగా కూడా ఒక భాగం అయ్యేలా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

జిల్లా కలెక్టర్‌ ఛామకూరి శ్రీధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement