
సర్పంచ్ భర్త కారుపై దాడి
గుర్రంకొండ : మండలంలోని ఎల్లుట్ల గ్రామ సర్పంచ్ లలిత భర్త మురళీకృష్ణ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు మురళీ కృష్ణ మండల టీడీపీ నాయకుడిగా, గుర్రంకొండ క్లస్టర్ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డితో కలసి కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాను గుర్రంకొండకు వస్తున్నానని ఇంటి దగ్గర నుంచి కారు తీసుకురావాల్సిందిగా డ్రైవర్ రెడ్డిశేఖర్కు ఫోన్ చేశారు. డ్రైవర్ కారు తీసుకొని గుర్రంకొండకు వస్తుండగా మార్గమధ్యంలో తురకపల్లె కనుమ వద్ద కొందరు కారును అడ్డగించి అద్దాలు పగులగొట్టినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. కంట్లో కారంపొడి చల్లి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘరామ్ తెలిపారు.
రహదారి విస్తరణకు
పరిహారం చెల్లించాలి
లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రంలోని మూడవ వార్డు, నాలుగో వార్డు పరిధిలో జాతీయ రహదారికి ఇళ్లు కోల్పోతున్న కుటుంబాల వారు శనివారం డిప్యూటీ తహసీల్దార్ రెడ్డన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ చాగలమర్రి నుంచి రాయచోటి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారికి సంబంధించి ఆయా ఇళ్ల వారికి నష్ట పరిహారం చెల్లించారన్నారు. తిరిగి ఇప్పుడు ముందు కోల్పోతున్న దానికంటే ఎక్కువగా మార్కింగ్ వేశారన్నారు. అందుకు తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు.
పురుగుల మందు తాగి
వ్యక్తి ఆత్మహత్య
చాపాడు : మండలంలోని ద్వారకానగరం గ్రామానికి చెందిన చింతకుంట దస్తగిరి (33) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దస్తగిరి గత కొన్ని రోజులుగా అప్పుల బాధతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.