
కాలువ కబ్జాను పట్టించుకోని అధికారులు
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని కోట్ల రూపాయలు విలువ చేసే కాలువ 1.55 సెంట్లు కబ్జాకు గురైందని, అర్జీ ఇచ్చి మూడు నెలలైనా అధికారులు పట్టించుకోవడం లేదని సీనియర్ నాయకుడు ఓజీ శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్రిమాను వద్ద నుండి ప్రభుత్వ ఆసుపత్రి, వై.కోట రోడ్డులో విలువైన కాలువ భూమి కబ్జాకు గురైందని, ఫిబ్రవరి 3వ తేదీ ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చానన్నారు. అయితే ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. కోట్ల రూపాయలు విలువచేసే కాలువ భూమి కబ్జాలకు పాల్పడి దళారులు అమ్ముకుంటున్నారన్నారు. దీనిపై ఇటీవల రాజంపేట సబ్ కలెక్టర్ వైఖోమ్ నదియా దేవికి ఫిర్యాదు చేశామన్నారు.