
ఐటీఐ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన
రాజంపేట టౌన్ : ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలన (వెరిఫికేషన్) చేయించుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్ రామిరెడ్డి రఘురామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోకుంటే వారి పేరు మెరిట్ జాబితాలోకి తీసుకోబడదన్నారు. జిల్లాలో మూడు ప్రభుత్వ, 12 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయని వివరించారు.
వెబ్సైట్లో జాబితా
రాయచోటి టౌన్ : రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ పూర్వపు జిల్లాలోని 32 మంది ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో సమర్పించిన బదిలీల ఆప్లికేషన్లు ఆప్రూవల్ చేసి జాబితాను ఆర్జేడీ వెబ్సైట్లో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఈ సీనియారిటి జాబితాను పరిశీలించుకోవాలని వారు సూచించారు.
నూతన నియామకం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పీలేరుకు చెందిన కె.మహితను స్టేట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, రాజంపేటకు చెందిన పి.రెహ్మన్ఖాన్ను రాష్ట్ర బూత్ కమిటీల విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఒంటిమిట్ట తేజను రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా, మదనపల్లెకు చెందిన డి.శేఖర్రెడ్డిని రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా..
అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన హస్తవరం ఆనందకుమార్ను రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
31న సౌమ్యనాథాలయంలో యోగాంధ్ర
నందలూరు : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో ఈ నెల 31న ఉదయం 8 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం అధికారి నాగభూషణం పేర్కొన్నారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఆయన శనివారం పరిశీలించి, దేవదాయ శాఖ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ జూన్ 21న జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని నాలుగు ప్రధాన పర్యాటక కేంద్రాల వద్ద యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారన్నారు. ఈ మేరకు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, ఈఓపీఆర్డీ సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.