
కొత్త బియ్యం కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి టౌన్: అర్హత కలిగి, ఇప్పటి వరకు బియ్యం కార్డులేని కుటుంబాలు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ఇదివరకే కార్డు కలిగి కార్డు విభజన, కార్డులో సభ్యులను జోడించడం, సభ్యుల పేరును తొలగించడం, బియ్యంకార్డు సరెండర్, బియ్యంకార్డులో చిరునామా మార్పు, బియ్యం కార్డులో తప్పు ఆధార్ సీడింగ్ దిద్దుబాటు వంటి సేవలను బుధవారం నుండి గ్రామ, వార్డు సచివాలయాలలో సేవలను ప్రారంభించామని డీఎస్ఓ రఘురాం ఒక ప్రకటనలో తెలియజేశారు. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
సౌమ్యనాథ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు
నందలూరు: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించగా రూ.2,64,921 వచ్చినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుండీ ఆదాయాన్ని నెలరోజుల తర్వాత లెక్కించామని.. వచ్చిన మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. ఈ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, విజిలెన్స్ అధికారి జనార్ధన, భక్తులు పాల్గొన్నారు.
నేడు సుగవాసి అంత్యక్రియలు
రాయచోటి: రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటిలో గురువారం ఉదయం 9 గంటల నుండి అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించనున్నామని కలెక్టర్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్ల కోసం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులకు సూచనలను చేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సుగవాసి మృతి తీరనిలోటు
రాయచోటి టౌన్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు మృతి చెందడం పార్టీకి తీరనిలోటని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం పాలకొండ్రాయుడు భౌతికకాయానికి మంత్రులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. వీరితోపాటు పుంగనూరు టీడీపీ ఇన్చార్జ్ చల్లా బాబు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుగవాసికి నివాళి అర్పించారు.

కొత్త బియ్యం కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం