
తండ్రి మరణం తట్టుకోలేక..
కురబలకోట : రైల్వే ట్రాఽక్ పక్కనున్న విద్యుత్ స్థంభం ఎక్కడంతో విద్యుత్ షాక్కు గురై భవన నిర్మాణ కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు..మండలంలోని సింగన్నగారిపల్లెకు చెందిన రామమూర్తి రైల్వేలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. ఇతని కుమారుడు కోటకొండ చంద్రశేఖర్ భవన నిర్మాణ కార్మికుడు. మద్యం తాగినప్పుడు తండ్రి గుర్తుకు వచ్చి ఊరి పక్కన ఉన్న రైల్వే ట్రాక్ ఎక్కేవాడు. కుటుంబీకులు లేదా తెల్సినవారు వెళ్లి రైలు ప్రమాదానికి గురికాకుండా బతిమాలి వెనక్కి తీసుకు వచ్చేవారు. గతంలో పలుమార్లు ఇలా జరిగినట్లు గ్రామస్థులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మద్యం సేవించాడు. మునుపటిలా తండ్రి గుర్తుకు రావడంతో నేరుగా రైల్వే ట్రాక్పైకి వెళ్లాడు. ఈసారి ఏకంగా మద్యం మత్తులో ట్రాక్ పక్కనున్న విద్యుత్ స్థంభం ఎక్కాడు. సర్వీసు వైరు పట్టుకున్నాడు. అంతే హై పవర్ విద్యుత్ కావడంతో షాక్ కొట్టడంతో ఒక్కసారిగా కింద పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. భర్తను వెతుక్కుంటూ వచ్చిన భార్య ఈ ఆకస్మిక సంఘటనతో నిశ్చేష్టురాలైంది. హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ స్థంభం ఎక్కిన వ్యక్తి
కరెంట్ షాక్కు గురై తీవ్ర గాయాలు