
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కృషి
రాయచోటి టౌన్ : రాయచోటి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రవాణ, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాల కోసం నాబార్డు కింద, ఆర్ఐడీఎస్ పథకం కింద మొత్తం రూ.12.06 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. రాయచోటి రూరల్ పరిధిలోని శిబ్యాల గ్రామంలో 700 ఎకరాల భూమిని గుర్తించామని, ఈప్రాంతంలో ఎస్సీజెడ్ తీసుకొచ్చి ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. తద్వారా ఆ ప్రాంతానికి చిన్న పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాయచోటి నియోజక వర్గంలోని ఆరు మండలాలలో తాగునీటి సమస్య కనిసిస్తోందని దానిని శాశ్వత పరిష్కారం కోసం రూ.300 కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టు నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక జల్ జీవన్ మిషన్ కింద టెండర్లు పిలిచినట్లు చెప్పారు.
జెడ్పీ సమావేశం వాయిదా
కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 15వ తేదికి వాయిదా వేసినట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేది నిర్వహించాలని తొలుత నిర్ణయించామని పేర్కొన్నారు. ఆరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండడం వల్ల ఈనెల 15వ తేది జెడ్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జెడ్పీ సభ్యులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
వైవీయూ డిగ్రీ పరీక్ష కూడా..
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల బీఏ బీకాం, బీఎస్సీ ,బీసీఏ , బీబీఏ ,ఒకేషనల్ 2,4,6 సెమిస్టరకు సంబంధించి ఈ నెల 7వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 7వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఐసెట్ పరీక్ష ఉందన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి, యోగివేమన విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నాని వివరించారు. వాయిదా వేసిన పరీక్షలను ఇదే నెల 23వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు.
వైభవం.. గజవాహనోత్సవం
బ్రహ్మంగారిమఠం : వైఎస్సార్జిల్లా బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. రెండో రోజైన సోమవారం రాత్రి గజవాహనోత్సవం జరిగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి గజవాహనంపై ఆశీనులను చేశారు. పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి వీరశివకుమారస్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు. ఉత్సవానికి గుంటూరు జిల్లా బుద్దాంకు చెందిన కట్టోజు సత్యనారాయణచార్యులు, వరహాలమ్మ, విశ్వనాథాచారి, గురుస్వాములు, శివరూపాచారి ఉభయదారులుగా వ్యవహరించారు.
ఐటీఐలలో అడ్మిషన్లు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అలాగే 14 ఏళ్లు నిండిన విద్యార్థులు అర్హులని తెలిపారు. అడ్మిషన్లు 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయిస్తామని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణపత్రం,టీసీ, ఆధార్, ఫొటో, మెయిల్ ఐడితోపాటు పర్మినెంట్గా వినియోగించే మొబైల్ నెంబర్తో దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐ వద్దకు వెళ్లి iti.a p.gov.in వెబ్సైట్ నందు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు రిజిస్ట్రేషన్కు మే 24వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు.

ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కృషి