
ప్రశాంతంగా ముగిసిన నీట్–2025
కడప సెవెన్రోడ్స్: నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్–2025 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించడం తొలిసారి కావడంతో జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్దేశించిన సమయం ముగిసిన తర్వాత వచ్చిన అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించలేదు. తమ పిల్లలు పరీక్ష రాస్తుండడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద నిరీక్షించారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
● జిల్లాలో మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాల్లో 2371 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకోగా 2311 మంది హాజరు కాగా, 60 మంది గైర్హాజరయ్యారు. కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 480మందికి గాను 468 మంది హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 480మందికిగాను 463 మంది, మున్సిపల్ హైస్కూలు (మెయిన్)లో 240 మందికిగాను 236 మంది, కేంద్రీయ విద్యాలయంలో 240 మందికిగాను 232 మంది, అంబేడ్కర్ గురుకులంలో 240కి 235మంది, చిన్నచౌకులోని వైఆర్ జెడ్పీ బాలికల హైస్కూలులో 159 మందికిగాను 154 మంది హాజరయ్యారు. కడప నగరంలోని మొత్తం ఆరు పరీక్షా కేంద్రాల్లో 1839 మందికిగాను 1788 మంది హాజరు కాగా, 51 మంది హాజరు కాలేదు. ఇక ప్రొద్దుటూరు పట్టణంలోని ఏబీఎంపీఎల్ హైస్కూలులో 172 మందికిగాను 168 మంది, వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో 360 మందికిగాను 355మంది హాజరయ్యారు. ఈ రెండు కేంద్రాల్లో మొత్తం 532 మందికిగాను 523 మంది హాజరు కాగా, తొమ్మిది మంది హాజరు కాలేదు.
2311 మంది విద్యార్థుల హాజరు