
ఎయిర్ పోర్టులో నిందితుడి అరెస్టు
కురబలకోట : పరారీలో ఉంటూ లుక్ అవుట్ నోటీసు జారీ చేయబడిన రామకృష్ణ అనే నిందితుడిని ముదివేడు పోలీసులు హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేసినట్లు ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ ఆదివారం తెలిపారు. ఇదివరకు అంగళ్లు ఎస్బీఐ బ్రాంచ్లో క్యాషియర్గా ఉండి ప్రస్తుతం నగిరి బ్రాంచ్లో పనిచేస్తున్న గాయత్రి ఇతనిపై 2021లో వరకట్నం కేసు పెట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇతను పరారీలో ఉన్నాడు. దుబాయ్కు వెళ్లిపోయాడు. శనివారం ఇతను శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు. లుక్ అవుట్ నోటీసు ఉండడంతో ఎయిర్పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ముదివేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి అతన్ని అరెస్టు చేసి తీసుకు వచ్చారు. ఆదివారం రిమాండుకు తరలించినట్లు ముదివేడు ఎస్ఐ తెలిపారు.