
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
రాజంపేట : రాజంపేట అర్బన్ పోలీసు స్టేషన్ పరిధిలో సున్నపురాళ్లపల్లె వద్ద జరిగిన ప్రమాదంలో హేమాద్రివారిపల్లె వాసి బి.వెంకటేశు(30) మృతి చెందాడు. శనివారం రాత్రి కదులుతున్న ట్రాక్టర్పై నుంచి కింద పడ్డాడు. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం రాజంపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మదనపల్లె : రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన నరసింహారెడ్డి (45), అదే గ్రామానికి చెందిన గోవర్దన్రెడ్డి (40) ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంలో అంగళ్లుకు వస్తుండగా, మార్గమధ్యంలో అంగళ్లు సమీపంలో టాటా సుమో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని గౌతమీనగర్కు చెందిన ఖాదర్బాషా భార్య నసీమా(35) కుటుంబ సమస్యలతో ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదేవిధంగా నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లె పంచాయతీ వెంకోజిగారిపల్లెకు చెందిన శంకరప్ప కుమారుడు శ్రీనివాసులు(32) కుటుంబ సమస్యలతో పురుగుమందు తాగాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
దళితుల పట్ల వివక్ష తగదు
రాయచోటి అర్బన్ : రాజంపేట మండలం కూచివారిపల్లె గ్రామం దిగువ బసవనాయుడుపల్లె దళితవాడ వాసుల పట్ల కుల వివక్షత ప్రదర్శించిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఎం.విశ్వనాథ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అరుంధతీవాడ సమీపంలోని భూములను విక్రయించుకునేందుకు దళితుల ఇళ్లు అడ్డుగా ఉన్నట్లు భావించారన్నారు. వెంటనే రంగంలోకి దిగి దళితవాడకు వెళ్లే దారిని ఆక్రమించారన్నారు. అంతటితో ఆగక దళితుల ఇళ్లు ఇతరులకు కనిపించకుండా తమ స్థలం చుట్టూ ఎత్తయిన గోడలు కట్టడం ద్వారా దళితులను వెలివేసేందుకు ప్రయత్నిస్తుండడం దారుణమన్నారు. సమావేశంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా నేత సిగి చెన్నయ్య పాల్గొన్నారు.