
ముక్కావారిపల్లెలో చోరీ
ఓబులవారిపల్లె : మండలంలోని ముక్కావారిపల్లె గ్రామంలో శనివారం రాత్రి కె.చెంగళరెడ్డి ఇంట్లో దొంగలు బంగారం, నగదు, పోస్టాఫీసు లాకర్ను దోచుకొని వెళ్లరు. చెంగళరెడ్డి గ్రామంలోని పోస్టాఫీసును తన ఇంటి వద్దే సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. ఇటీవలే తన కుమారుడి వివాహం అయినందున కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా ఇంటిలో చోరీ జరిగినట్లు గుర్తించారు. పది తులాల బంగారం, రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ చోరీ జరిగినట్లు చెబుతున్నారు. జాతీయరహదారి పక్కనే ఇటీవల ముక్కా భాస్కర్ రెడ్డి ఇంట్లో చోరీకి విఫలయత్నం చేశారు. అదే ఇంట్లో ఎవరూలేని విషయాన్ని గమనించి శనివారం రాత్రి కూడా చోరీకి ప్రయత్నించారు. ఎస్ఐ పి.మహేష్ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు.
తల్లి,బిడ్డ అదృశ్యంపై కేసు నమోదు
రామసముద్రం : రామసముద్రం మండలం కమ్మవారిపల్లి పంచాయతీ ఎర్రబోయునిపల్లికి చెందిన గంగాధర భార్య గొర్రెల గాయత్రి (26), మూడేళ్ల కుమారుడు అఖిల్ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా ఆచూకీ లభిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
సింహాద్రిపురం : వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన సింహాద్రిపురం మండలం లోమడ గ్రామంలో జరిగింది. బంధువులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మేకల నారాయణ (53) గొర్ల కాపరిగా వెళ్లేవాడు. రోజు మాదిరిగా ఆదివారం ఆయన గొర్రెలను మేపేంందుకు వెళ్లాడు అక్కడ తీవ్ర వేడికి వడదెబ్బ తగిలి స్పృహ కోల్పోయి పడిపోవడంతో తోటి కాపర్లు వెంటనే ఆటోలో తొండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.