
బి.మఠం దేవస్థానంలో అభివృద్ధి భేష్
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అభివృద్ధి భేష్గా ఉందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ ప్రశంసించారు. ఆదివారం బి.మఠం దేవస్థానం పరిధిలో రూ 3.40 కోట్ల నిధులతో చేపట్టిన పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో మఠం ప్రాకారం, కల్యాణ మండపం, టీటీడీ సదనంలో సీసీ ఫ్లోరింగ్, పోలేరమ్మ గుడి వద్ద టాయిలెట్ బ్లాక్, గుడి ఆవరణలో ఫ్లోరింగ్ తదితర పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతం కన్నా ఇప్పుడు బ్రహ్మంగారిమఠం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అందరి సహకారంతో బి.మఠం దేవస్థానం అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానన్నారు. మఠం అభివృద్ధిలో భాగంగా తొలగించిన తాత్కాలిక బస్ షెల్టర్ స్థానంలో రూ.10 లక్షలతో త్వరలోనే బస్ షెల్టర్ ఏర్పాటు చేయిస్తామన్నారు. అలాగే బస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తానన్నారు.