
ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
ఒంటిమిట్ట: ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎర్రచందంన తరలించే వారిపై కేసులు నమోదు చేస్తామని కడప డీఎఫ్ఓ వినీత్ కుమార్ అన్నారు. శనివారం ఒంటిమిట్ట పారెస్ట్ రేంజ్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ శుక్రవారం తెల్లవారుజామున ఒంటిమిట్ట చెరువు కట్టపై అనుమానాస్పదంగా ఆల్విన్ లారీ వెళ్తుండటంతో ఒంటిమిట్ట ఫారెస్టు సిబ్బంది ఆపగా.. డ్రైవర్ నిలపకుండా వెళ్లాడు. దీంతో వాహనాన్ని వెంబడించారు. కొద్దిదూరంలో వాహనాన్ని వదిలేసి లారీ డ్రైవర్ పరారయ్యాడు. మినీ లారీలో స్మగ్లర్లు వదిలేసిన మొబైల్ ఫోన్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. ఈ కేసులో పరారైన పీలేరు జిల్లా రేగళ్ల కు చెందిన మురళి కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు కడప డీఎఫ్ఓ తెలిపారు. ఆల్విన్ లారీలో 84 దుంగలను కూరగాయల మాటున తీసుకెళ్లేందుకు నిందితులు ప్రయత్నం చేశారు. వాటి విలువ సుమారు రూ. 11 లక్షలు ఉంటుందని తెలిపారు. అయితే బయటి మార్కెట్లో వీటి విలువ సుమారు రెండు కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. ఈ కార్యక్రమంలో సబ్ డీఎఫ్ఓ వివేకానంద, ఎప్ఆర్ఓ బాలసుబ్రమణ్యం, ప్రసాద్, డీఆర్ఓ నాగు నాయక్, ఎఫ్ఎస్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.