
పాత కక్షలే హత్యకు దారి తీశాయా?
మదనపల్లె : మదనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన యువకుడి దారుణ హత్య ఘటనలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా పాత కక్షలే హత్యకు దారితీసి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకు బలం చేకూరుస్తూ మృతుడి సోదరి శశికళ శనివారం తన సోదరుడు సునీల్ కుమార్(25) హత్య ఘటనపై టూ టౌన్ పోలీసులకు.. మృతుని స్నేహితుడు పెద్దబాలి అలియాస్ బాలాంజనేయులు అలియాస్ బాల, అతని స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన సునీల్ కుమార్ మదనపల్లి మండలం బసినికొండ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పట్టణంలో సోనూ అనే వ్యక్తితో కలిసి ఎలక్ట్రీషియన్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఎనిమిది నెలల క్రితం శృతి అనే యువతితో వివాహం కాగా, ఇంటర్ పరీక్షలు రాసేందుకు ఆమె పుట్టింటికి వెళ్లింది. దీంతో తన సోదరి శశికళ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నాడు. ఒకటో తేదీ (గురువారం) పనులకు వెళ్లి వస్తానని అక్క శశికళతో చెప్పి బయటికి వచ్చాడు. ఆరోజు ఇంటికి వెళ్లలేదు. దీంతో శశికళ ఫోన్ చేయగా తనకు పని ఉందని, చూసుకొని తర్వాత వస్తానని చెప్పాడు. అయితే శుక్రవారం రాత్రి పట్టణంలోని శేషప్ప తోట మయూరి కల్యాణ మండపం సమీపంలోని చర్చి వెనుక వైపున చెట్టు కింద.. తల, ముఖంపై బండరాళ్లతో కొట్టడంతో తీవ్ర గాయాలై హత్యకు గురై పడి ఉండడంతోపాటు మృతుడి తల, ముఖానికి అడ్డుగా బండరాళ్లు ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, సోదరి శశికళకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న శశికళ సోదరుని మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించింది.
గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా..
బాలాంజనేయులు అతని స్నేహితులు గౌతమ్, కమలాకర్లు తన తమ్ముడి హత్యకు కారకులై ఉంటారని శశికళ పోలీసులకు తెలిపింది. ఎందుకంటే తనతో బాలాంజనేయులు అసభ్యంగా ప్రవర్తించాడని, ఈ విషయం మనసులో ఉంచుకొని కక్షతో హత్య చేశారని ఆరోపించింది. రెండో తేదీ (శుక్రవారం) సునీల్ కుమార్, బాలాంజనేయులు, అతని స్నేహితులతో సంఘటన స్థలం వద్ద ఘర్షణ పడినట్లు తనకు సమాచారం ఉందని చెప్పింది. ఘర్షణ హత్యకు కారణమై ఉంటుందని పేర్కొంది. తనపై బాలాంజనేయులు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించింది. కాగా ఆరు సంవత్సరాల క్రితం మండలంలోని రామాచార్లపల్లి వద్ద జరిగిన హత్య కేసులో బాలాంజనేయులు నిందితుడిగా ఉన్నాడు. అదే కేసులో సునీల్కుమార్ సాక్షిగా ఉన్నాడు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ సునీల్ కుమార్ను బాలాంజనేయులు పలుమార్లు బెదిరించాడు. అంతేకాకుండా ఏడాది క్రితం శశికళ ఇంట్లో ఉండగా బాలాంజనేయులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై సునీల్ కుమార్ బాలాంజనేయులుతో ఘర్షణపడి దాడి చేశాడు. ఈ నేపథ్యంలో పాత కక్షలే హత్యకు దారి తీసి ఉంటాయని భావిస్తున్నారు. అయితే హత్య ఘటనలో ఎంత మంది పాల్గొన్నారు? హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మృతదేహాన్ని పరిశీలించిన డీఎస్పీ
సునీల్ కుమార్ మృతదేహాన్ని డీఎస్పీ మహేంద్ర శనివారం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీ గది వద్ద పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హత్య కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు.
హత్య కేసులో సాక్షిగా ఉన్న
సునీల్ కుమార్
మృతుడి సోదరితో బాలాంజనేయులు అసభ్య ప్రవర్తన
హత్యకు ముందు గొడవపడ్డారంటున్న సోదరి

పాత కక్షలే హత్యకు దారి తీశాయా?