
మామిడి చెట్లు దగ్ధం
పుల్లంపేట : మండల పరిధి వెంగమాంబ ఆర్.గొల్లపల్లె గ్రామంలో శనివారం దాదాపు ఐదు ఎకరాల మామిడి, నిమ్మ చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామ సమీపంలోని నల్లిపల్లె లలితమ్మ, రాజశేఖర్రావు, చెంగయ్య అనే రైతులకు చెందిన మామిడి, నిమ్మ చెట్లు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు కంచెకు నిప్పు పెట్టడంతో.. మంటలు తోట అంతా వ్యాపించాయి. విషయ తెలిసి రైతులు వెళ్లి చూసే సరికి ఏమీ మిగలలేదు. వేసవిలో ఆకతాయిలు ఎండిపోయిన గడ్డికి నిప్పు పెడుతుండటంతో ఇలా జరుగుతోందని రైతులు పేర్కొంటున్నారు. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
వృద్ధురాలిపై పిచ్చికుక్క దాడి
మదనపల్లె : పిచ్చికుక్క దాడిలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. కొండామరిపల్లె పంచాయతీ బెస్తపల్లెకు చెందిన నారాయణమ్మ (70) ఇంటి ముందు కూర్చుని ఉండగా.. అకస్మాత్తుగా పిచ్చికుక్క ఆమైపె దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు కుక్కను వెంబడించడంతో పరిగెత్తుతూ దారి వెంట ఎదురుపడిన ఆవులు, దూడలను కరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వృద్ధురాలిని వెంటనే మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలని తిరుపతికి రెఫర్ చేశారు.
కీచక ఉద్యోగిపై విచారణ
సాక్షి టాస్క్ ఫోర్స్ : ‘ఆ శాఖలో.. కీచకుడు’ అనే కథనం శనివారం సాక్షిలో ప్రచురితమైంది. ఈ కథనం ఆ శాఖలో కలకలం రేపింది. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయంతోపాటు జిల్లా కలెక్టరేట్ అధికారులు ఆరా తీశారు. ఈ అంశానికి సంబంధించి ఈ నెల 5వ తేదీన ఉదయం 10.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో.. విచారణకు హాజరు కావాలని జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, క్షయ నివారణ అధికారి తెలిపారు. ఫిర్యాదు చేసిన వారితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి.. మొత్తం నలుగురిని విచారణకు పిలిచినట్లు సమాచారం. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి వాయిస్ రికార్డ్లు, ఇతర ఆధారాలు ఉన్నాయి. కాగా ఈ విచారణను సొంత శాఖకు చెందిన వారా లేదా ఆ శాఖకు సంబంధం లేని అధికారులా, ఎవరు విచారణ చేపడుతారో తెలియాల్సి ఉంది. జరుపబోయే ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయం గెలవాలని ఆ శాఖకు చెందిన ఉద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.

మామిడి చెట్లు దగ్ధం

మామిడి చెట్లు దగ్ధం