వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మెడతోటి మూర్తి (18) మృతి చెందాడు. తన చిన్నాన్న రాజశేఖర్తో కలిసి మూర్తి చెన్నూరుకు వచ్చేందుకు నేషనల్ హైవే రోడ్డు దాటుతుండగా కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన తప్పెట వెంకట సుబ్బారెడ్డి ట్రాక్టర్తో ఢీ కొన్నాడు. ఈ ఘటనలో మూర్తి తలకు బలమైన గాయమై అక్కక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిన్నాయపల్లె సమీపంలో గుర్తు తెలియని మృతదేహం
పోరుమామిళ్ల : మండలంలోని సిద్దవరం పంచాయతీ చిన్నాయపల్లెకు తూర్పున తెలుగుగంగ కాలువ గట్టున గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు వేపచెట్టుకు ఉరి వేసుకుని ఉన్న వ్యక్తి శవాన్ని అడవి జంతువులు లాగడంతో కింద పడిందన్నారు. ఈ ఘటన నెల రోజుల క్రితం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తు పట్టేందుకు వీలు లేకుండా ఉంది. మృతుడి ఒంటిపై ఎర్రచొక్కా, గళ్ల లుంగీ ఉన్నాయి. చెట్టుకు చీరతో ఉరి వేయడాన్ని గమనిస్తే ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అన్న అనుమానం కలుగుతోంది.