
మద్యం బాటిళ్లు స్వాధీనం
పెద్దమండ్యం : మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ పీవీ రమణ తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీ గొల్లపల్లె పంచాయతీ బాటవారిపల్లెలో చింతచెట్టుకింద మద్యం బాటిళ్లు విక్రయిస్తుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి 92 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు బాటివారిపల్లెకు చెందిన నాగేశ్వరమ్మ, ఆనందరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా బెల్ట్షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నాలుగు ఆటోలు సీజ్
పీలేరు రూరల్ : రికార్డులు సక్రమంగా లేని నాలుగు ఆటోలు సీజ్ చేయడంతోపాటు రూ. 21,610 జరిమానా విధించినట్లు ఎంవీఐ పి. విజయకుమారి తెలిపారు. బుధవారం స్థానిక సదుం మార్గంలో ఆర్టీసీ పీలేరు డిపో మేనేజర్ బి. నిర్మలతో కలసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆటోల రికార్డులు పరిశీలించి సక్రమంగా లేని ఆటోలు సీజ్ చేసి, జరిమానా విధించినట్లు తెలిపారు. రోడ్డు నియమాలు అతిక్రమించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎయిడ్స్పై విస్తృతమైన
అవగాహన కల్పించాలి
రాయచోటి టౌన్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో ఎయిడ్స్పై విస్తృతమైన అవగాహన కల్పించాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ వైద్యాధికారి డాక్టర్ శైలజ సూచించారు. బుధవారం పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలలో అవగాహన కలిగినప్పుడే ఈ వ్యాధులను నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు.
బోగినేని మణిపై కేసు నమోదు
ఓబులవారిపల్లె : జనసేన పార్టీ నాయకుడు, రాయలసీమ జోనల్ కన్వీనర్ బోగినేని చిన్న మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మండలంలోని చెన్నరాజుపోడు గ్రామంలో ఏప్రిల్ 10వ తేదీన శ్రీరామనవమి గ్రామోత్సవం సందర్భంగా అర్థరాత్రి పాత కక్షల కారణంగా ఎన్ఆర్ఐ పత్తి సుబ్బరాయుడు, అతని భార్య పత్తి రాజేశ్వరిపై జోగినేని మణి కాలితో తన్ని దాడి చేశాడు. ఈ విషయంపై పత్తి రాజేశ్వరి దంపతులు రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు వద్ద ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు మంగళవారం జోగినేని మణిపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థికి గాయాలు
మైదుకూరు : పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరుకు చెందిన వైద్య విద్యార్థి వీరమల్లు నవనీత్ కుమార్ గాయపడ్డాడు. నవనీత్ కుమార్ తండ్రి వీరమల్లు మల్లేష్ వైఎస్సార్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓగా పనిచేస్తున్నారు. పోతిరెడ్డిపాలెం వద్ద కారు ఇంటిని ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, నవనీత్కుమార్ తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన గురించి తెలియగానే నవీనత్ కుమార్ తండ్రి డాక్టర్ మల్లేష్ కుటుంబ సభ్యులతో కలిసి హుటాహుటిన నెల్లూరుకు బయల్దేరారు.

మద్యం బాటిళ్లు స్వాధీనం