
నేడు పాలిసెట్ పరీక్ష
రాజంపేట: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నికల్ కళాశాలల ప్రవేశాలకు సంబంధించి పాలిసెట్ పరీక్ష బుధవారం నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. పట్టణంలో మూడు సెంటర్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 975 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇప్పటికే హాల్టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తేడాలు ఉంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రందించాల్సి ఉంటుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలి. తమ వెంట ఆధార్కార్డు తెచ్చుకోవాలి.
డీఈఈ సెట్కు
దరఖాస్తు చేసుకోండి
రాయచోటి అర్బన్: రాష్ట్రంలో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ ) కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈ సెట్ – 2025 నోటిఫికేషన్ విడుదలైనట్లు డైట్ ప్రిన్సిపల్ అజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 29 నుంచి మే 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మే 20న హాల్టికెట్ల విడుదల, జూన్ 2,3 తేదీలలో పరీక్ష, 10న ఫలితాల ప్రకటన ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల ఎంపిక, అభ్యర్థుల అర్హతల నిబంధనలు, కోర్సు ఎంపిక విధానం తదితరాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్పైట్ను సందర్శించాలని వివరించారు.
నేడు లైట్లు ఆఫ్ చేసి నిరసన
కడప కల్చరల్: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బుధవారం రాత్రి లైట్లు ఆఫ్చేసి నిరసనలు తెలియజేయాలని వక్ఫ్ పరిరక్షణ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. రాత్రి 9 నుంచి 9.15 వరకు 15 నిమిషాల వరకు ఇంటిలో, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో లైట్లు ఆఫ్ చేసి ప్రతి ఒక్కరూ తమ నిరసనలు తెలియజేయాలని కోరారు.
4న లాంగ్మార్చ్
కడప కార్పొరేషన్: వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మే 4వ తేది ఆదివారం జరిగే లాంగ్ మార్చ్ను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పిలుపునిచ్చారు. మంగళవారం కడప నగరంలోని అంజద్బాషా కార్యాలయంలో పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత జమ్ము కశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి లో మరణించిన వారికి స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ముంతాజ్బేగం, వైఎస్సార్ సీపీ నాయకుడు జమాల్వలీ, పెద్దిరెడ్డి రామ్మోహన్రెడ్డి, అల్లాబక్ష్, అల్తాఫ్, బీహెచ్ ఇలియాస్, త్యాగరాజు, వినోద్, జమీల్, బాబు, కార్పొరేటర్లు పాకా సురేష్, షఫీ, బసవరాజు, బాలస్వామిరెడ్డి, షంషీర్, చాక్లెట్ గౌస్, మల్లికార్జున, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఉన్నారు.
బాల్య వివాహాలకు
పాల్పడితే చర్యలు
రాయచోటి అర్బన్: జిల్లాలో బాల్యవివాహాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీడీఎస్ పీడీ రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర తృతీయ పండుగను పురస్కరించుకుని జిల్లాలోని దేవాలయాల్లో బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున వాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. జిల్లా దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో కలసి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల అధికారులు, పురోహితులకు బాల్య వివాహ నిషేధ చట్టంను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. ఆలయాల్లో వివాహాలు చేసుకోదలచిన వారి వయసు ధ్రువీకరణ పత్రాలు (ఆధార్కార్డును ప్రామాణికంగా తీసుకోకూడదు) టెన్త్ మార్కులిస్టు, ప్రభుత్వం జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్లు, పాఠశాల రిజిస్టర్లో నమోదు చేసిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. బాల్యవివాహ చట్టం ప్రకారం యువతులకు 18 ఏళ్లు, యువకులకు 21 ఏళ్లు పూర్తయి ఉండాలన్నారు. లేనిపక్షంలో పెళ్లికి సహకరించే షామియానా షాపుల వారు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్స్, పురోహితులు, వాయిద్యకారులు, వివాహం కుదిర్చిన వ్యక్తులు, వివాహానికి హాజరైన పెద్దలు తదితరులు శిక్షార్హులవుతారన్నారు. బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే బాల్యవివాహ నిషేధాధికారులైన ఆర్డీఓ, ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్వైజర్లు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, తహసీల్దార్లు, చైల్డ్వెల్ఫేర్, పోలీసు, సచివాలయం అడ్మిన్ సెక్రటరీ, మహిళా సంరక్షణ కార్యదర్శులకు ముందస్తుగా తెలిపి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.