
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలి
రాయచోటి అర్బన్ : ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లా డుతూ ప్రజలను నమ్మించి వంచించడంలో చంద్రబాబును మించిన మహా ఘనుడు మరెవరూ లేరన్నారు. సూపర్ సిక్స్ పథకాల గురించి ఊరూరా ఊదరగొట్టి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 10 నెలలు గడుస్తున్నా హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదంటూ మండిపడ్డారు. వృద్ధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ పథకాలు తప్ప మరేవీ అమలుకాకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు, సహాయ కార్యదర్శి మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబ శివ, శ్రీనివాసులు, సుమిత్ర, మురళి, శివరామక్రిష్ణ దేవర, జ్యోతి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.