
శ్రీ భద్రకాళీ సమేతుడికి పల్లకి సేవ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడికి అమావాస్య పల్లకీ సేవ నిర్వహించారు. ఆదివారం అమావాస్య కావడంతో రాత్రి మూల విరాట్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు అభిషేకాలు చేశారు. రంగు రంగుల పూలు, పట్ట వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డిఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, బుద్దిస్ట్, సిక్కు, జైను, పార్సీ మైనార్టీల సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ హిదాయతుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి వయసు 21–55 ఏళ్ల మధ్య ఉండాలని, ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలుగా నిర్ణయించారన్నారు. రూ.లక్ష యూనిట్కు సంబంధించి 50 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల యూనిట్ ఖర్చు వరకు గరిష్టంగా రూ.1.25 లక్షలు సబ్సిడీ, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు యూనిట్ ఖర్చుకు గరిష్టంగా రూ.2 లక్షల సబ్సిడీ, రూ.5 నుంచి రూ.8 లక్షల యూనిట్ 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు.