
గుక్కెడు నీళ్లు..గుప్పెడు గింజలు
మదనపల్లె సిటీ: ఈసారి ఎండలు ఆరంభం నుంచే అదరగొడుతున్నాయి. ఉష్ణతాపం తీవ్రమవుతుండటంతో జంతుజాలం దాహంతో అల్లాడుతోంది. మనుషులైతే దప్పిక వేసినపుడు ఎలాగోలా గొంతు తడుపుకొంటారు. కానీ మూగజీవాలకు ఇబ్బందిగా ఉంటుంది. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవి ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలేమా? అని హెల్పింగ్ మైండ్స్ సంస్థ, గణపతిసచ్చిదానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులకు కలిగిన ఆలోచన మదనపల్లె పరిసర ప్రాంతాల్లో వేలాది పశుపక్షాదుల దాహార్తిని తీరుస్తోంది.
● సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పక్షుల రక్షణకు నడుం బిగించింది హెల్పింగ్మైండ్స్, సచ్చిదానంద ఆశ్రమం నిర్వాహకులు. సేవేమార్గంగా వాటర్బౌల్ ప్రాజెక్టును ప్రారంభించారు.అలాగే ధాన్యం గింజలతో పాటు పండ్లు కూడా అక్కడక్కడ ఉంచుతున్నారు.
25 తొట్టెలతో ప్రారంభమై...
పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2018లో వాటర్బౌల్ పేరుతో మదనపల్లెకు చెందిన హెల్పింగ్మైండ్స్ సంస్థ సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది నుంచి సభ్యులు, దాతల సహకారంతో మదనపల్లె–బెంగుళూరు రోడ్డు, కురబలకోట మండలం రైల్వేస్టేషన్వద్దనున్న ఫారెస్టు రోడ్డు ప్రాంతాల్లో వాటర్బౌల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది సుమారు100కు పైగా తొట్టెలను ఏర్పాటు చేశారు. వీటిలో ట్యాంకర్ల సాయంతో నీరు నింపుతున్నారు. ఫారెస్టులోని నెమళ్లు, దుప్పిలు, జింకలు, పావురాలు, కోయిలలు, కోతులు, కుక్కలు,కాకులు వాటర్బౌల్స్ వద్దకు వచ్చి దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఈ వాటర్బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్బౌల్ ప్రాజెక్టులో భాగస్వాములమువుతామని ముందుకు వస్తున్నారు.
వాటర్బౌల్స్ వితరణ
స్థానిక బొమ్మనచెరువువద్దనున్న గణపతి సచ్చిదానందస్వామి గత నాలుగేళ్లుగా ఆశ్రమ నిర్వాహకులు భక్తులకు వాటర్బౌల్స్ను ఉచితంగా అందజేస్తున్నారు. బౌల్స్లో మంచి నీళ్లు నింపి ఇంటి ముందు, పరిసర ప్రాంతాల్లో పక్షులకు అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు. దీంతో పట్టణంలో పలు ప్రాంతాల్లో వేసవిలో ఈ కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు.
వాటర్ బౌల్ పేరుతో వినూత్న ఆలోచన
ఉచితంగా అందిస్తాం
వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా సంస్థ వాటర్బౌల్ ప్రాజెక్టు ప్రారంభించాం. మదనపల్లె సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. మూగజీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా ఉచితంగా తొట్టెలను అందిస్తాం. –అబుబకర్సిద్దిక్, హెల్పింగ్మైండ్స్
సంస్థ వ్యవస్థాపకులు,మదనపల్లె.

గుక్కెడు నీళ్లు..గుప్పెడు గింజలు

గుక్కెడు నీళ్లు..గుప్పెడు గింజలు