మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతంలో నివాసమున్న అబ్దుల్లా భార్య సమీన(22), భర్త వేధింపులతో మనస్థాపం చెంది ఇంట్లోనే ఎలకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అబ్దుల్లా వృత్తిరీత్యా డ్రైవర్ కాగా, ఉపాధి నిమిత్తం పెళ్లి అయిన రెండు నెలలకే కువైట్కు వెళ్లాడు.
ప్రతి రోజూ భార్యకు ఫోన్ చేసి నువ్వు చచ్చిపో అంటూ వేధించడంతో, మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ కుమారుడు అర్షద్ (35), కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది సూపర్ వాస్మాల్, ఎలకల మందు కలిపి తిని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
జాతర ఏర్పాట్ల పరిశీలన
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో మే 1వ తేదీ నుంచి జరిగే జాతరలో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అన్నమయ్య జిల్లా ఏఎస్పీ మనోహ్రామ్నాథ్హెగ్డే సిబ్బందిని ఆదేశించారు. జాతర జరిగే ప్రాంతాలను శుక్రవారం ఆయన పరిశీలించి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ వైభవంగా జరిగే జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ హేమసుందర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.
పుష్పగిరి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
వల్లూరు : పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి, లక్ష్మీచెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ చేశారు. స్వామికి ఉదయం పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, రక్షా బంధన కార్యక్రమాలు జరిపారు. కొండపై లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో అర్చకులు అఖిల్దీక్షితులు స్వామిని అభిషేకించారు. రాత్రి విశ్వక్సేన పూజతో కార్యక్రమాలు ప్రారంభించారు. పుట్ట వద్దకు వెల్లి పవిత్రమైన మట్టి తీసుకువచ్చి భూదేవిగా అలంకరించి మేదినీ పూజ జరిపారు. నవధాన్యాలతో అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్తోక్తంగా నిర్వహించారు.
రిమ్స్ ఓపీలోక్యాంటీన్ ప్రారంభం
కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఓపీలో 24 రోజుల తరువాత క్యాంటీన్ గురువారం తిరిగి ప్రారంభించారు. క్యాంటీన్ తెరవ లేదని, ప్రజలు, వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారనీ ఇటీవల పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఆస్పత్రి అధికారులు క్యాంటీన్ను ఒకరికి అప్పగించారు. త్వరలో జరిగే ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో అక్కడ ఏ పద్ధతిలో ఇవ్వాలనేది తీర్మానించనున్నట్లు అధికారులు తెలియజేశారు.