రాయచోటి టౌన్ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి, కరువు భత్యం చెల్లించాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు డిమాండ్ చేశారు. పులివెందులలోని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై గురువారం ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ చెల్లించాలని, అది అమలయ్యేలోపు 29 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. మిగిలిపోయిన జీపీఎస్ ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ బకాయిలు, పేరుకపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు రోడ్ మ్యాప్ వేయాలని కోరారు. సెప్టెంబర్ 2004కు ముందు నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. విశ్రాంత ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గురుకులం, పబ్లిక్ సెక్టార్, మోడల్ స్కూల్ ఉద్యోగులు, ఎంటీసీలకు పదవీవిరమణ వయస్సు 62కు పెంచాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రమేష్బాబు, సురేష్ కుమార్, అబ్దుల్ గఫార్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.