రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని రాఘవరాజపురం హరిజనవాడకు చెందిన వికలాంగుడు డోలా సతీష్(38) గురువారం గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి దాటాక గంగరాజపురం డాబా వద్ద వెళ్తుండగా ఆయనను వాహనం ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రయాణికులకు
మెరుగైన సేవలు
మదనపల్లె సిటీ : ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని జిల్లా ప్రజా రవాణాధికారి రాము పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ–2 డిపో బస్టాండు, స్టాల్స్, గ్యారేజీలోని బస్సులను గురువారం ఆయన తనిఖీ చేశారు. రాము మాట్లాడుతూ సమయపాలన పాటించి బస్సు నడపాలని, ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృిషి చేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 మెయింటెన్స్ అయిన బస్సులను తీసుకెళ్లి పరీక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎం అమరనాథ్, సీఐ గీత, సిబ్బంది పాల్గొన్నారు.
హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
పెనగలూరు : మండలంలోని ఓబిలి గ్రామానికి చెందిన బుర్రకట్ట ఈశ్వరయ్యకు జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధించినట్లు ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 2020 జనవరి, 28న అన్నదమ్ములు బుర్రకట్ల మహేశ్వరయ్య, బుర్రకట్ల ఈశ్వరయ్యల మధ్య చెత్త తీయు విషయమై మాటా మాటా పెరిగి ఘర్షణ జరిగింది. బుర్రకట్ల మహేశ్వరయ్య తలపై బుర్రకట్ల ఈశ్వరయ్య రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో రక్తస్రావం కావడంతో మహేశ్వరయ్య మృతి చెందాడు. అప్పటి ఎస్ఐ చెన్నకేశవ రాజంపేట మండలం, మునక్కాయలపల్లి గ్రామానికి చెందిన కడియాల శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సాక్షులను విచారించి శుక్రవారం రాజంపేట అడిషనల్ జడ్జీ ప్రవీణ్ కుమార్ ముద్దాయికి జీవిత ఖైదు, రూ. 2 వేలు జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలియజేశారు.