రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపులో సంప్రదాయ దుస్తుల్లోనే పాల్గొనాలని ఈవో డీవీ రమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. సీ్త్రలు చీర, పురుషులు పంచె, షర్ట్ ధరించి రావాలన్నారు. పాల్గొనదలచిన వారు ముందుగా వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
స్వామి పాదాలు తాకనున్న సూర్య కిరణాలు
నేటి(బుధవారం) నుంచి ఈ నెల 31వ తేది వరకు ఉదయం 6 గంటల నుంచి 6–30 గంటల లోపు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకనున్నాయని ఈవో తెలిపారు. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారు దక్షసంహారనంతరం అవతార సమాప్తి చేసి.. అర్చనామూర్తిగా వెలసిన అవతార మూర్తిని సూర్యభగవానుడు సప్తద్వారాలు దాటి.. గర్భాలయంలోని స్వామి వారి పాదాలను తాకుతాయని తెలిపారు. సూర్య భగవానుడికి శివ జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీ వీరభద్రస్వామి పాదాలను.. దక్షప్రజాపతి సూర్యకిరణాల ద్వారా పాద పూజ చేసుకొంటారని, అందులో భాగంగానే ఈ సూర్యకిరణాలు ప్రసరిస్తాయనే భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నారు.
ఇళ్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వ అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తోందని, ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా హౌసింగ్ పీడీ సాంబశివయ్య తెలిపారు. స్థానిక మున్సిపాలిటీ మెప్మా కార్యాలయంలో మంగళవారం మెప్మా సిబ్బందితోపాటు మున్సిపల్ ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇళ్లు మంజూరైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు నిర్మించుకోలేక, అర్ధాంతరంగా ఆగిపోయి ఉంటే.. అటువంటి వారికి ప్రభుత్వం అదనంగా సాయం అందిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీ, బీసీలకు రూ.50 వేల అందిస్తుందన్నారు. ఈ విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. సొంత స్థలం ఉండి.. నిర్మించుకోదలిస్తే పక్కా ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. స్థలం లేని వారు స్థలం, ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈ ఈశ్వర్రెడ్డి, రాజంపేట హౌసింగ్ ఈఈ మురళీకృష్ణ, మెప్మా ప్రతినిధి అయ్యవారయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసీ కెనాల్ నీటి
విడుదలకు చర్యలు
కడప సెవెన్రోడ్స్: కేసీ కెనాల్ ఆయకట్టుకు ఏప్రిల్ 15వ తేది వరకు నీరు అవసరమని జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీలో కోరడంతో ఆ విషయాన్ని తాము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని కేసీ కెనాల్ (స్పెషల్) సబ్ డివిజన్ మైదుకూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎస్.పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు తగు చర్యలు తీసుకుంటామని వారు తెలి పారని వెల్లడించారు. ఈనెల 22న సాక్షి దినపత్రికలో ‘ఇటు కేసీ చూడండి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలోని కేసీ కాలువ పరిధిలో ఉన్న పంటలకు ఇప్పటివరకు నీరు అందిస్తూనే ఉన్నామని తెలిపారు.
క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక స్కౌట్
రాయచోటి అర్బన్: విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతోపాటు దేశభక్తి, సామాజిక సేవాభావాలను పెంపొందించడానికి బాలభటుల ఉద్యమం (స్కౌట్ అండ్ గైడ్స్) ఎంతో తోడ్పడుతుందని ఉపవిద్యాశాఖ అధికారి శివప్రకాష్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్లు, గైడ్కెప్టెన్లకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో స్కౌట్యూనిట్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో ప్రవేశం పొందిన విద్యార్థుల వివరాలు మార్చి 31వ తేదీలోపు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, జిల్లా కోశాధికారి ఎం.ఓబులరెడ్డి, ఏఎస్ఓసీ లక్ష్మికర్, రీసోర్స్పర్సన్ గురుప్రసాద్రెడ్డి, రాజంపేట, రాయచోటి డివిజన్ల స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు, కట్మాస్టర్స్, ప్లాక్లీడర్స్ తదితరులు పాల్గొన్నారు.
సంప్రదాయ దుస్తుల్లోనే పాల్గొనాలి