– కోడూరు వాసి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : తమిళనాడులోని తిరువణ్ణామలై పుణ్యక్షేత్రానికి వెళ్లి శివుడి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు వాసి మృతి చెందాడు. దర్శనం అనంతరం స్నేహితులతో కారులో వస్తుండగా చిత్తూరు జిల్లా పాకాల వద్ద మంగళవారం కారు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కోడూరు మండలం రాఘవరాజపురం (సత్రం)కు చెందిన కౌలురైతు వెలిగిచెర్ల నరసింహారెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య రజని, కొడుకు ఈశ్వర్, 5 నెలల పాప ఉంది. తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
పది ప్రశ్నపత్రం లీకేజీపై విచారణ
సాక్షిటాస్క్ఫోర్స్ : వల్లూరు జెడ్పీ హైస్కూల్ పరీక్షా కేంద్రం నుంచి సోమవారం పదో తరగతి గణితం ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విచారణ కొనసాగుతోంది. కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, కమలాపురం సీఐ ఎస్కే రోషన్, ఎస్ఐ ప్రతాప్ రెడ్డిల నేతృత్వంలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు అత్యంత రహస్యంగా విచారణ జరిపారు. ఇప్పటికే వల్లూరు జెడ్పీ హైస్కూల్ పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారితోపాటు ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పరీక్షా కేంద్రంలో విద్యా శాఖకు సంబంధం లేని బయటి వ్యక్తిని వాటర్బాయ్గా నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. అతని ద్వారానే ప్రశ్నప్రతం బయటకు వచ్చిందనే ఆరోపణలున్నాయి. అలాగే పలువురు ఇన్విజిలేటర్లు, సిబ్బంది సెల్ఫోన్లు కూడా లోనికి దర్జాగా తీసుకెళ్లారంటే పరీక్షల నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. ఈ అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది.