ప్రొద్దుటూరు: ఈ నెల 28వ తేదీన జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యాన స్థానిక ఎస్సీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ(ఆర్ట్స్కాలేజీ)లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జి.చంద్రశేఖర్, జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ టి.శశికాంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కడప కొప్పర్తిలోని ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ కంపెనీలో అసెంబ్లింగ్ ఆపరేటర్, హెల్పర్, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటీఐ/డిప్లొమా, బీటెక్ (ఈసీఈ, ఈఈఈ) చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు 28న ఉదయం 9 గంటలకు జాబ్ మేళాలో పాల్గొనాలని, మరిన్ని వివరాలకు 9573321678 నంబర్కు సంప్రదించాలని కోరారు.
మధ్యవర్తిత్వంపై శిక్షణ
కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్లు కడప న్యాయ సేవా సదన్లో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ రీసోర్స్ పర్సన్ పీజీ సురేష్ మాట్లాడుతూ న్యాయవాదుల పాత్ర, మధ్యవర్తిత్వం, రాజీ నియమాలు, కమ్యూనికేషన్ నిర్వచనం, ప్రక్రియ, ప్రభావవంతమైన, సమర్ధమైన కమ్యూనికేషన్, ప్రయోజనాలు కమ్యూనికేషన్ రకాలు, కమ్యూనికేషన్ పద్ధతులు, మౌఖిక కమ్యూనికేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రశ్నలు, తటస్థతతో సానుభూతి, రోల్ ప్లే–4 మొదలగు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్స న్ జి జ్యోతి, న్యాయవాదులు పాల్గొన్నారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాను గంజాయి రహిత జిల్లాగా రూపొందించడమే లక్ష్యంగా విశాఖ పట్నం, విజయవాడ నుంచి కడపకు వచ్చే రైళ్లు, బస్సులు, పార్శల్ కేంద్రాల్లో పోలీస్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం విశాఖపట్నం నుండి కడపకు చేరుకున్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలులో తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీని పరిశీలించారు. అనంతరం నగరంలోని బస్టాండు, సెవెన్ రోడ్స్ వద్ద ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాలలో, పార్శల్ సెంటర్లు, గోడౌన్లలో తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణాకు పాల్పడినా, సహకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో ఫ్యాక్షన్ జోన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, జీఆర్పీ ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డి, ఆర్పీఎఫ్ ఎస్ఐ నాగభూషణం, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.