రాయచోటి జగదాంబసెంటర్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం ముస్లిం మైనార్టీ మహిళలకు ఖురాన్ పఠనం, ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
జెడ్పీ ఎన్నికల్లో
పోటీ చేయం
– టీడీజీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి
కడప రూరల్ : వైఎస్సార్ కడప జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సంఖ్యా బలం లేదన్నారు. అందువలన తాము జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా జెడ్పీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, మాధవి రెడ్డి పాల్గొన్నారు.
నిత్యకల్యాణానికి విరాళాలు
బ్రహ్మంగారిమఠం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవింద మాంబల నిత్య కళ్యాణానికి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. సోమవారం రాజుపాళెం మండలం అరకటవేముల గ్రామానికి చెందిన రాచంరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, ధర్మపత్ని వెంకటసుబ్బమ్మ కుటుంబ సభ్యులతో స్వామి మాస కళ్యాణంకు కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే ఈ కళ్యాణంకు రూ.1,00,150లు నగదు అందజేశారు. ఇదే క్రమంలో దువ్వూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన మాబుషరీఫ్ ధర్మపత్ని రేష్మి రూ.1,00,116లు అందించారు. వీరికి స్థానిక పిట్ పర్సన్ శంకర్బాలాజీ,మఠం మేనేజర్ ఈశ్వరాచారిలు ప్రత్యేక పూజలు చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పిట్ పర్సన్ మాట్లాడుతూ.. నూతనంగా తలపెట్టిన వీరబ్రహ్మేంద్ర, గోవిందమాంబల మాస కార్తిక శుద్ద ద్వాదశ రోజున జరిపే కళ్యాణానికి భక్తులకు వారికి తోచిన విధంగా విరాళాలు ఇస్తుండటం హర్షనీయమన్నారు.