కలికిరి : కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు జరిగిన జేఎన్టీయూ యూనివర్సిటీ స్థాయి 12వ ఇంటర్ కాలేజియేట్ గేమ్స్ మీట్–2025 ఆటల పోటీలలో జేఎన్టీయూ ఏ అనంతపురం విద్యార్థులు ప్రతిభ చాటి ఓవరాల్ చాంపియన్ ట్రోఫీ దక్కించుకున్నారు. గేమ్స్ మీట్ ముగింపు సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. కలికిరి కళాశాలలో మొదటి సారిగా యూనివర్సిటీ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో కళాశాలకు మంచి గుర్తింపు లభించిందన్నారు.
విజేతలు వీరే..
టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో జేఎన్టీయూ ఏ అనంతపురం, బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తిరుపతి కేఎంఎం కళాశాల, బ్యాడ్మింటన్ పురుషులు సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో మదనపల్లి మిట్స్ కళాశాల విజేతలుగా నిలిచాయి. త్రోబాల్ మహిళల విభాగంలో మదనపల్లి మిట్స్, హ్యాండ్ బాల్ మహిళల విభాగంలో పులివెందుల జేఎన్టీయూ, వాలీబాల్ మహిళల విభాగంలో తిరుపతి ఎస్వీసీఈ కళాశాల, ఖోఖో పురుషుల విభాగంలో కలికిరి జేఎన్టీయూ, హ్యాండ్ బాల్ పురుషుల విభాగంలో పుత్తూరు సిద్దార్థ కళాశాల, వాలీబాల్ పురుషుల విభాగంలో పుత్తూరు సిద్దార్థ కళాశాల టీంలు విజేతలుగా నిలిచాయి. ఓవరాల్ చాంపియన్ షిప్ టైటిల్ను 50 పాయింట్లతో జేఎన్టీయూ ఏ అనంతపురం కళాశాల సొంతం చేసుకుంది. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ త్యాగరాజన్, జేఎన్టీయూ అనంతపురం ఫిజికల్ డైరెక్టర్ జోజిరెడ్డి, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.