మదనపల్లె : తన ఇంట్లో పనికి రాలేదని, పనిమనిషి అన్నపై టీడీపీ నాయకుడు కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసి దాష్టీకానికి పాల్పడ్డాడు. మనస్థాపం చెందిన వ్యవసాయ కూలీ టీడీపీ నాయకుడి ఇంటివద్దే పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ఘటనపై బాధితుడు తెలిపిన మేరకు వివరాలు.. మదనపల్లె మండలం వేంపల్లి పంచాయతీ గుట్టకిందపల్లెకు చెందిన కృష్ణమూర్తి కుమారుడు శంకర (50) వ్యవసాయ కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నాడు. అతని చెల్లెలు లక్ష్మీదేవి మదనపల్లె పట్టణంలోని కమ్మ వీధిలో నివాసం ఉంటున్న కొత్తపల్లె మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడు బోయపాటి గోపాల్ రెడ్డి ఇంట్లో పని చేస్తుంది. ఆదివారం లక్ష్మీదేవి బంధువులకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆమె గోపాల్ రెడ్డి ఇంటికి పనికి వెళ్లలేదు. ఈ విషయమై గోపాల్ రెడ్డి శంకరకు ఫోన్ చేసి, మీ చెల్లెలు ఎందుకు పనికి రాలేదని ప్రశ్నించాడు. తమ కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉంటే కూడా మీకు పనికి రావాలా అంటూ శంకర అసహనం వ్యక్తం చేశాడు. దీంతో గోపాల్ రెడ్డి నీతో మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మని పిలిచాడు. సాయంత్రం శంకర గోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లగా, నన్ను ఫోన్లో నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అంటూ గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి, అసభ్య పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా వైర్లతో కొట్టి దాడి చేశాడు. దీంతో మనస్థాపం చెందిన శంకర పురుగుమందు తీసుకొని వచ్చి గోపాల్ రెడ్డి ఇంటికి సమీపంలోనే తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెంటనే తరలించారు. అత్యవసర విభాగ వైద్యులు చికిత్స అందించారు.
● చెల్లెలు పనికి రాలేదని అన్నపై దాడి
● మనస్థాపంతో టీడీపీ నాయకుడి ఇంటి వద్ద
ఆత్మహత్యాయత్నం