
ప్రేమ వివాహం చేసుకున్నారని యువకుడి ఇంటిపై దాడి
లక్కిరెడ్డిపల్లి : తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారనే కారణంగా సోమల వెంకటేశ్వర్లు అనే యువకుడి ఇంటిపై టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఇంట్లో ఉన్న యువకుడి తల్లిదండ్రులు వెంకటలక్షుమ్మ, వెంకటరమణ, అక్కా, బావలను చితకబాదారు. ఈ ఘటన లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల గ్రామం సోమలవాండ్లపల్లెలో శనివారం అర్థరాత్రి జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని మద్దిరేవుల గ్రామం, సోమలవాండ్లపల్లికి చెందిన సోమల వెంకటేశ్వర్లు అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సుంకర వెంకటరమణ కుమార్తె శివలీలను ఈనెల 15వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరు మేజర్లు కావడంతో పెళ్లి అనంతరం అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమకు ప్రాణహాని ఉందని వెంకటేశ్వర్లు, శివలీల ఇరువురు కలిసి స్వగ్రామానికి రాకుండా రాయవరం వద్ద తెలిసిన మిత్రుల ఇంటిలో తలదాచుకున్నారు. అక్కడ ఉన్నట్లు సమాచారాన్ని సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ఇటీవల వారిపై దాడి చేశారు. స్థానికులు సుండుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు యువతి, యువకుడిని సుండుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత వారిరువురు స్వగ్రామానికి రాకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. దీంతో వారి సమాచారం తెలపాలని శనివారం అర్థరాత్రి మూకుమ్మడిగా వెంకటేశ్వర్లు ఇంటిపై కర్రలు, ఇనుపరాడ్లతో అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసి తలుపులు, కిటికీలను ధ్వంసం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న యువకుడి తల్లిదండ్రులను, వారి కుటుంబ సభ్యులను రోడ్డుపైకి ఈడ్చి చితకబాదారు. ఈ మేరకు బాధితులు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
దాడిలో గాయపడిన యువకుడి
తల్లిదండ్రులు, అక్కా, బావ
పోలీసులు కేసు నమోదు చేయలేదని
బాధితుల ఆవేదన