
దళిత, గిరిజనుల పక్షపాతి వైఎస్సార్
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలోని దళిత, గిరిజనులకు భూములు పంపిణీ చేసిన దళిత, గిరిజన పక్షపాతి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని బీకేఎంయూ అధ్యక్షుడు పండుగోలు మణి పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే దళిత గిరిజనులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు మేరకు రెండు ఎకరాలు భూమి పంపిణీ చేశారని తెలిపారు. తరువాత ముఖ్యమంత్రులు ఎవరూ దళిత గిరిజనులకు భూమి పంపిణీ చేయలేదని విమర్శించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పేదలకు ఒక్క సెంటు భూమి పంచిన పాపాన పోలేదన్నారు. ఎన్నికల ముందు పేదలు, కార్మికులకు హామీలు ఇచ్చి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కృష్ణప్ప, జ్యోతి చిన్నయ్య, చైతన్య, రాజశేఖర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.