రామసముద్రం : మండలంలోని చెంబకూరు నుంచి కొత్తూరుకు వెళ్లే రోడ్డు మార్గంలో శనివారం సాయంత్రం కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. దీంతో చెట్టుపై మంటలు రాజుకున్నాయి. గతనెల రోజులుగా ఉక్కపోతకు గురైన ప్రజలకు వాతావరణంలో మార్పులు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లుల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో చెంబకూరుకు చెందిన రైతు గాండ్ల శంకరప్ప పొలంలోని కొబ్బరిచెట్టుపై పిడుగు పడటంతో మంటలు ఏర్పడ్డాయి. దీన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.
జింకపై కుక్కల దాడి – కాపాడిన యువకులు
నందలూరు : మండలంలోని బహుదానది సమీపంలోని నేషనల్ హైవే బైపాస్ రోడ్డు పక్కన ఉన్న వరి పంట పొలాల్లో ఓ జింకను శనివారం కొన్ని కుక్కలు వెంటపడి దాడి చేస్తుండగా కొంతమంది యువకులు కాపాడారు. జింకను కాపాడి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జింకను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కుక్కల దాడి నుంచి రక్షించి సమాచారం తెలిపిన యువకులు గొల్లపల్లికి చెందిన బడే, తిమ్మయ్య, పవన్ కుమార్, కొండయ్య, నందకుమార్, షమీవుల్లాను స్థానికులు అభినందించారు.

కొబ్బరిచెట్టుపై పిడుగు