తప్పతాగి మంటల్లో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

తప్పతాగి మంటల్లో పడి వ్యక్తి మృతి

Mar 23 2025 12:23 AM | Updated on Mar 23 2025 12:23 AM

తప్పత

తప్పతాగి మంటల్లో పడి వ్యక్తి మృతి

రామాపురం : మండలంలోని నల్లగుట్టపల్లె పంచాయతీ బీసీ కాలనీకి చెందిన గంప చిన్న సుబ్బయ్య (55) తప్పతాగి మంటల్లో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని నల్లగుట్టపల్లె పంచాయితీ బీసీ కాలనీకి చెందిన గంప చిన్నసుబ్బయ్య శుక్రవారం సాయంత్రం పొలం వద్ద గట్టుకు నిప్పుంటించడానికి వెళ్లి నిప్పులో పడి మృతి చెందాడు. రాత్రి వరకు భర్త ఇంటికి రాకపోవడంతో భార్య సుబ్బయ్య ఇంటి పక్కన వాళ్లను ఆరా తీసింది. మరుసటి రోజు ఉదయం శనివారం ఆ గ్రామ పరిధిలోనే గొర్ల కాపరులు మేతకు వెళ్లి చూసి గ్రామస్తులకు సమాచాం ఇచ్చారు. వెంటనే పొలం గట్టు వద్దకు వెళ్లి చూడగా తన భర్త నిప్పులో పడి మృతి చెందాడని, విషయాన్ని మండల పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోగొట్టుకున్న పర్సు అప్పగింత

రాయచోటి టౌన్‌ : పట్టణానికి చెందిన మహిళ శనివారం ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో తన పర్సు పోగొట్టుకొంది. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో సీఐ బివి చలపతి సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకొని తన సిబ్బంది హెచ్‌సీ సురేంద్ర ద్వారా పరిశీలించారు. దొంగను పట్టుకొని పోగొట్టుకున్న పర్సును స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే బాధ్యురాలిని పిలిచి పోగొట్టుకున్న బ్యాగ్‌ (పర్స్‌) అప్పగించారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ షాపింగ్‌ కోసమైనా, ఇతరా అవసరాల కోసం వచ్చిన సందర్భంలో మీతో తెచ్చుకున్న విలువైన వస్తువులు, బ్యాగ్‌లు, పర్సులను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. కొత్త వ్యక్తుల పట్ల జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పెళ్లికి పిలవడానికి వచ్చి చోరీ

ఎర్రగుంట్ల : పట్టణంలోని 12వ వార్డులో నివాసం ఉండే మహుబూబీని పెళ్లికి పిలవడానికి వచ్చి ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడు కొత్తపల్లి ఖాసీంపీరాను అరెస్టు చేసినట్లు సీఐ నరేష్‌బాబు తెలిపారు. శనివారం కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఖాజీపేట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన ఖాసీంపీరా చెడు వ్యసానాలకు లోనై అప్పులు చేశాడు. ఇతను చాలా ఏళ్లుగా మట్కా బెట్టింగ్‌, అప్పులు అధికంగా చేశాడు. ఎలాగైన తెచ్చిన అప్పులు కట్టడం కోసం అడ్డ దారిలో డబ్బు కోసం ముసలి వారిని టార్గెట్‌ చేసుకున్నాడు. వారితో పరిచయం చేసుకుంటూ మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి బంగారు వస్తువులు, డబ్బులు లాక్కుని పారిపోతుంటాడని చెప్పారు. ఇలా ఖాసీంపీరాపై పలు కేసులు ఉన్నాయన్నారు. ఈ తరుణంలో ఈ నెల 9వ తేదీన కడప పాత బస్టాండ్‌ దగ్గర నుంచి ఆటో తీసుకుని వల్లూరు, కమాలపురం, ఎర్రగుంట్లకు వచ్చాడు. యర్రగుంట్ల పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ వెనుక ఉన్న మహుబూబీ అనే వృద్ధురాలి వద్దకు వెళ్లి నిద్రలేపాడు. నేను మీ కోడలి బంధువు అని నమ్మించాడు. మా పాపాకు పెళ్లి చేస్తున్నాం.. అందరూ పెళ్లికి రావాలన్నాడు. పెళ్లికి కూతురికి మీ చేతికి ఉన్న ఉంగరంను అదే సైజులో చేయించాలి. మీ ఉంగరం ఇస్తే బయట ఆటోలు కూర్చోని ఉన్న వారికి చూపించి వస్తాను అని చెప్పాడు. దీంతో మహుబూబీ నమ్మి చేతికి ఉన్న బంగారు ఉంగరం తీసి ఇచ్చింది. ఆ ఉంగరం తీసుకొని ఖాసీంపీరా అక్కడ నుంచి ఊడాయించాడు. దీంతో బాధితురాలు మహూబూబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఖాసీంపీరాను ఎర్రగుంట్లలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.

వేంపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌పై

చర్యలు చేపట్టాలి

– ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ను

సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వేంపల్లె ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ ఈశ్వరయ్యపై సత్వరమే చర్యలు చేపట్టాలని వేంపల్లె టీడీపీ నాయకుడు శేషయ్యతో పాటు కార్యాలయ పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, శేషారెడ్డి, వెంకటేశ్‌, రాజశేఖర్‌రెడ్డి, నాగేష్‌రెడ్డి, గంగయ్య, వాసుదేవారెడ్డి తదితరులు కోరారు. ఈ మేరకు వారు శనివారం కడపలోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ వీఎస్‌ఆర్‌ ప్రసాద్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభ్యర్థన మేరకు వేంపల్లె ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకునేందుకు డీఐజీ హామీ ఇవ్వడంపై ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. ఇతనిపై గతంలో కూడా ఫిర్యాదు చేయగా, విచారణలు సైతం జరిగాయన్నారు. వేంపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌పై డీఐజీ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా రిజిస్ట్రార్‌ పీవీఎన్‌ బాబును సంప్రదించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేంపల్లె ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ను సస్పెండ్‌ చేసినట్లు తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంలో

ముగ్గురికి గాయాలు

కొండాపురం : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ సమీపంలోని కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్‌ ట్రాలీని టిప్పర్‌ ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు.. ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు చేపట్టిన నాలుగు వరుసల రోడ్డు నిర్మాణ పనులు కోసం వచ్చిన మహిళా కూలీలు వెంకటాపురం వద్ద ట్రాక్టర్‌ ట్రాలీ నుంచి దిగుతుండగా తాడిపత్రి వైపు వెళ్లే టిప్పర్‌ ఢీ కొంది. మహిళలు శివమ్మ, రమాదేవి, భవాని గాయపడ్డారు. వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తప్పతాగి మంటల్లో పడి  వ్యక్తి మృతి 1
1/1

తప్పతాగి మంటల్లో పడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement