
ఆడుతూ...పాడుతూ చదివేద్దాం
మదనపల్లె సిటీ : పిల్లలు ఎంతగానో ఎదురు చూసే ఒంటిపూట బడులు రానే వచ్చాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకే పాఠశాలలు ఉంటాయి. తరువాత ఇంటికి రాగానే బడి బ్యాగులను పెట్టడమే స్నేహితులతో ఎంచక్కా చెట్లు, పుట్టలు, గుట్ల వెంట తిరుగుతూ ఆటలాడటం, బావులు,చెరువుల వద్దకు వెళ్లడం, ఈత వచ్చినా రాకున్నా వాటిల్లోకి దిగి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో పిల్లల విషయంలో తల్లిదండ్రులకు అప్రమత్తత అవసరం. పిల్లలను మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా చూడటం మేలు. అలా అని వారు టీవీలు, సెల్ఫోన్లకు అంటిపెట్టుకుని ఉండటమూ తగదు. ఈ దశలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మధ్యాహ్న సమయంలో..
దినపత్రికలను చదివేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచాలి. ఆదివారం అనుబంధం లాంటి మ్యాగజైన్లలో ఫజిల్స్ను సాధన చేయాలి. తద్వారా మెదడు పనితీరు చురుకవుతుంది. బొమ్మలకు రంగులు వేసే పుస్తకాలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. పిల్లలు బయటకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ క్యారమ్స్, చెస్ వంటి ఆటలు ఆడాలి. ఆటల పరికరాలు అనేకం షాపుల్లో దొరుకుతాయి. ఇంట్లోనే పిల్లలు వాటితో భవనాలు, వంతెనలు, యంత్రాలను నిర్మించడం ఆసక్తికరంగా ఉంటుంది. అవి వారికి ఎంతో కాలక్షేపాన్ని కలిగిస్తాయి.
తల్లిదండ్రులు తమ బాల్యంలో ఆడుకున్న పరమపద సోపానపటం, వామనగుంతలు,పులి మేక దాడి, అష్టా చెమ్మా వంటి ఆటలు ఉంటాయి. పిల్లలకు వాటిని పరిచయం చేసి వారితో పాటు కలిసి ఆడుకుంటే బాగుంటుంది.
ఆహారంపై శ్రద్ధ
ఎండ తీవ్రత కారణంగా చిన్నారులు త్వరగా నీరసించిపోతుంటారు. పాఠశాలకు వెళ్లే సమయంలో తేలికపాటి ఆహారం, త్వరగా జీర్ణమయ్యే అల్పాహారంతో పాటు పండ్లరసం అందజేయాలి. భోజనంలో కూరగాయలు, ఆకు కూరలు ఉండే విధంగా చూడటంతో పాటు అధిక నీటి శాతం ఉన్న కూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వేపుళ్లకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి.
అప్రమత్తతే కీలకం:
చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు వెళ్తుంటారు. లోతు తెలియకుండా దిగడం వల్ల ప్రమాదాలు జరిగే అస్కారం ఉంటుంది. జిల్లాలో గతంలో అనేక చోట్ల ఈతకు వెళ్లి పలువురు చిన్నారులు నీటమునిగి మృత్యువాత పడిన సంఘటనలున్నాయి. ఎండల్లో ఎక్కువ తిరగడం వల్ల వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం గొడుగులు వాడటం, టోపీలు ధరించడం, ముఖానికి చేతిరుమాలు కట్టుకునేలా జాగ్రత్తలు సూచించాలి.
సాయంత్రం పూట:
5 గంటల తరువాత ఎండ తగ్గుముఖం పడుతుంది. అప్పుడు పిల్లలు బయట ఆటలు ఆడుకునేలా చూడాలి. శారీరక వ్యాయామంలా ఉంటుంది. రాత్రి 7 గంటల తరువాత చదువుకోవటంపై విద్యార్థులు దృష్టి సారించాలి. హోంవర్క్ చేసుకోవాలి.
ఒంటపూట బడులు కావటం వల్ల పిల్లలు వేకువజామునే నిద్రలేవాల్సి ఉంటుంది. అందువల్ల రాత్రిపూట తొందరగా నిద్రపోవడం మేలు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు : 2,200
విద్యార్థులు : 1,54.789
ప్రైవేటు పాఠశాలలు : 543
విద్యార్థులు : 1,12,589
ఒంటిపూట బడి .. ఓ కంట కనిపెట్టాలి
తల్లిదండ్రులకు అప్రమత్తత అవసరం
పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టాలి
ఒంటిపూట బడుల సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా కనిపెట్టాలి. వారి అలవాట్లు, ఆహారం, ఆరోగ్యం, చదువు వంటి విషయాల్లో ప్రణాళిక కలిగి ఉండాలి. దినపత్రికలు, పుస్తక పఠనాన్ని అలవర్చితే ధీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది.
– పి.ప్రసాద్రెడ్డి, పీడీ, ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ, మదనపల్లె
అనారోగ్యానికి గురైతే నిర్లక్ష్యం వద్దు
ఎండలో ఆటలు ఆడటం వలన చిన్నారులు వెంటనే డీహైడ్రేషన్కు గురవుతారు. చర్మంపై ముడతలు ఏర్పడటం, గొంతు ఎండిపోవడం వంటి లక్ష్యణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పండ్లు, పండ్లరసాలు, కూరగాయలు, నీటి శాతం అధికంగా ఉన్నవాటిని తీసుకోవాలి.
– డాక్టర్ ఆశాలత, పీహె చ్సీ, కోసువారిపల్లె

ఆడుతూ...పాడుతూ చదివేద్దాం

ఆడుతూ...పాడుతూ చదివేద్దాం