గాలివీడు : ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చిత్తూరు వ్యవసాయ శాఖ డీడీఏ మధుసూదన్రెడ్డి రైతులకు సూచించారు.ఆయన శుక్రవారం పూలుకుంట గ్రామంలో ఉలవల పంపిణీ, ఉలవ పంట సాగుపై బండమీద పల్లి, రెడ్డివారి పల్లెలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట సాగుపై రైతుల దగ్గర నుంచి వివరాలను సేకరించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పార్థసారధిరెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం అందించిన ఉలవల ద్వారా అధిక విస్తీర్ణంలో ఈ ప్రాంతంలో రైతులు సాగు చేశారని, దిగుబడి కూడా ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ప్రతి రైతు పంట మార్పిడి ద్వారా భూ సారాన్ని కాపాడాలని తెలిపారు. అనంతరం ఉలవ పంట సాగుచేసిన రైతులను అభినందించారు. కార్యక్రమంలో ఏడీఏ శివప్రసాద్,ఏవో గౌతమి, ఏపీఎంఐపీ డీసీఓ శివశంకర్, మాజీ సర్పంచ్ నాగన్న, మాజీ సొసైటీ డైరెక్టర్ కొండారెడ్డి, రైతులు నాగేశ్వరరావు, గోపాలయ్య తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు వ్యవసాయ శాఖ డీడీఏ
మధుసూదన్రెడ్డి