లక్కిరెడ్డిపల్లి : కుటుంబ కలహాల నేపత్యంలో అల్లుడు పసుపుల వెంకటరమణపై అత్తా, మామలతోపాటు మరో ఇద్దరు కలిసి పట్టపగలు అందరూ చూస్తుండగానే వేట కొడవళ్లతో దాడి చేసిన సంఘటన లక్కిరెడ్డిపల్లి మండలం, పందిళ్లపల్లి గ్రామం, జింకలగట్ట వడ్డిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికల వివరాల మేరకు .. పసుపుల వెంకటరమణకు 20 సంవత్సరాల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం. అయితే పసుపుల వెంకటరమణ భార్యకు అంతకు మునుపే మరో మరో వ్యక్తితో వివాహమైందని, అప్పటికే ఇద్దరు సంతానం కూడా ఉన్నారని బంధువులు తెలిపారు. శుక్రవారం సాయంకాలం సమయంలో పసుపుల వెంకటరమణ తన ఇంటి వద్ద ఆరుబయట కూర్చొని ఉండగా అత్తా, మామలు, భార్య, ముందు సంతానం అయిన ఇద్దరితో కలిసి ఒక్కసారిగా కొడవళ్లతో పసుపుల వెంకటరమణపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు రక్త గాయాలతో పడి ఉన్న పసుపుల వెంకటరమణను స్థానికులు 108 సాయంతో లక్కిరెడ్డిపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం కడపరిమ్స్కు తరలించారు. లక్కిరెడ్డిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని జరిగిన విషయంపై స్థానికులు ద్వారా సమాచారాన్ని సేకరించారు. పసుపుల వెంకటరమణపై దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ రవీంద్రబాబును సాక్షి వివరణ కోరగా స్టేషన్లో ఇప్పటి వరకు ఫిర్యాదు ఇవ్వలేదన్నారు.