పుల్లంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిపై పుల్లంపేట మండలం, ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పరు, కంటైనర్ ఢీ కొన్నాయి. టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రాజంపేట మండలం, ఊటుకూరు గ్రామానికి చెందిన చీమకుర్తి శివ (35) టిప్పర్ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శివ శుక్రవారం మంగంపేట నుంచి టిప్పర్లో రాజంపేటకు వస్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా గుజరాత్ నుంచి చైన్నెకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని బలంగా ఢీ కొనడంతో శివ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కంటైనర్ డ్రైవర్ పాండు తీవ్రంగా గాయపడ్డాడు. ఏఎస్పీ రామనాథ్ హెడ్డే, రూరల్ సీఐ రమణ, పుల్లంపేట ఏఎస్ఐ పిచ్చయ్యలు తమ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడిన కంటైనర్ డ్రైవర్ పాండును రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. శివ మృతదేహం టిప్పర్లో ఇరుక్కుపోగా జేసీబీ సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా రెండు భారీ వాహనాలు ఢీ కొని రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో సుమారు మూడు గంటలసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు జేసీబీల సహాయంతో రెండు వాహనాలను ప్రక్కకు తొలగించి ట్రాపిక్ను పునరుద్ధరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
టిప్పర్ డ్రైవర్ మృతి
కంటైనర్ డ్రైవర్ పరిస్థితి విషమం
జాతీయ రహదారిపై టిప్పర్ కంటైనర్ ఢీ