మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం జిల్లా ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం సాయబులవారిపల్లెకు చెందిన హసన్సాబ్ కుమారుడు మౌలాలి(25) గురువారం సాయంత్రం ఇంటి వద్ద నుంచి వస్తుండగా, ముదివేడు క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల సహాయంతో గాయపడ్డ బాధితుడిని 108 అంబులెన్స్ వాహనంలో కుటుంబసభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు పొందుతూ మౌలాలి మృతి చెందాడు. వైద్యులు సకాలంలో స్పందించలేదని, మెరుగైన చికిత్స అందించకపోవడంతోనే మౌలాలి మృతి చెందాడని ఆరోపిస్తూ రాత్రి నిరసనకు దిగారు. ఇదే విషయమై శుక్రవారం ఉదయం మరోసారి నిరసనకు దిగారు. బంధువులు, కుటుంబీకులు, గ్రామస్తులతో కలిసి అత్యవసర విభాగాన్ని ముట్టడించారు. ప్రమాదం జరిగిన గంట వరకు మౌలాలి బతికే ఉన్నాడని, అంబులెన్స్లో తీసుకువచ్చేటప్పు డు వాహనంలో ఆక్సిజన్ సిలిండర్ లేదన్నారు. తర్వాత ఆస్పత్రికి చేరుకునేంతవరకు ప్రాణాలతో ఉన్న మౌలాలి, ఆస్పత్రిలోకి వెళ్లిన 5 నిమిషాలలోపే ప్రాణం వదలడమేంటని ప్రశ్నించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ షుకుర్, ఆందోళనకారులతో చర్చించేందుకు రాగా వైద్యులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రూరల్ సీఐ సత్యనారాయణ చొరవతీసుకుని, ఆందోళనకారులతో, ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి, న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బాధితులు
డాక్టర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్