రాయచోటి: జిల్లాలో ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి చట్టానికి అనుగుణంగా సూచనలు, సలహాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ రాజకీయ పార్టీలను కోరారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ గురించి ఈఆర్ఓ, డీఈఓల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి సూచనలు ఆహ్వానిస్తోందన్నారు. భారత ఎన్నికల సంఘం సూచించిన ప్రజా ప్రాతినిధ్యం, చట్టం, ఓటర్ల నమోదు నియమాలు, ఎన్నికల నియమాలు నిర్వహణ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు, భారత ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, మాన్యువల్స్, హ్యాండ్ బుక్కులు అంశాలపై అన్ని జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి ఏప్రిల్ 30 నాటికి సూచనలు, సలహాలు అందజేయాల్సి ఉందన్నారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో పటిష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల ఈవీఎంలను పగులకొట్టేందుకు ప్రయత్నించారని, సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ను కోరారు.
ఈవీఎం గోదాం సందర్శన
స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. గోదాంలోని ఈవీఎంల బీయూ, సీయూ, వివిధ ప్యాట్లను వారు పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మధసూదన్రావు, కలెక్టర్ ఎన్నికల విభాగం సూపరిటెండెంట్ రెడ్డప్ప, తహసీల్దార్ నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చామకూరి శ్రీధర్