వేసవి కాలం వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు రోజూ ఎక్కడో ఒకచోట చోటు చేసుకుంటున్నాయి. అగ్ని ప్రమాదాల కారణంగా రైతులు అధికంగా నష్టపోతున్నారు. జిల్లాలో పండ్ల తోటలు సాగు అధికంగా ఉంది. తోటలకు వేసిన కంచె, ఏపుగా పెరిగిన గడ్డి, అటవీ ప్రాంతాల్లో ప్రతి రోజు మంటలు వ్యాపిస్తూ వన్యప్రాణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
● బీడు భూములు, పంట పొలాలు, పండ్ల తోటలు, అడవులకు నిప్పంటుకోవడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల ఆకతాయిల చర్యలు, పశువులను మేతకు అడవులకు తీసుకెళ్లే కాపరుల నిర్లక్ష్యం, పొగాకు పదార్థాలను ఆర్పకుండా పడేయడం, ఉద్దేశపూర్వకంగా నిప్పంటించడం ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. బీడీలు, సిగరెట్లు, చుట్టలు పూర్తిగా ఆరనివ్వకుండా పడేయడం వల్ల చిన్న మంట పెద్దిగా మారి అడవిని కబళిస్తోంది.
● మంటల వల్ల ప్రధాన రహదారులకు ఇరువైపులా చెట్లు, పొదలు, కంచెలు కాలిపోతుండటం వాహనదారులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో చెలరేగిన మంటల నుంచి పొగ కమ్ముకోవడంతో, ఎదురెదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మంటల ధాటికి పండ్లను ఇచ్చే చెట్లు, ప్రకృతి ప్రసాదునిగా ఉన్న వృక్షాలు పూర్తిగా కాలిపోతుండటంతో జీవవైవిధ్యం నాశనమైపోతోంది.
● ఉన్నఫలంగా వ్యాపిస్తున్న మంటలను సిబ్బంది అదుపులోకి తేవడానికి శ్రమిస్తున్నప్పటికీ, పెద్ద ఎత్తున వ్యాపిస్తున్న ఈ అగ్నికీలలను నియంత్రించడం వీలుకాకుండా పోతుంది. జిల్లాలో భారీ స్థాయి పరివ్రమలు లేకపోయినా తోటలు, పొలాలు, అడవుల్లో పొడి ఆకులు, చెట్ల కొమ్మలు ఎక్కువగా ఉండటంతో, ఒక్కసారి మంటలు వ్యాపిస్తే అవి అదుపులోకి రాకముందే వందలాది ఎకరాలు కాలిపోతున్నాయి.
● మంటల వల్ల పొలాల సమీపంలో ఉన్న వృక్షాలు, పండ్ల తోటలు అగ్నికి ఆహుతవుతున్నాయి. అలాగే వన్యప్రాణులు మంటల ధాటికి అడవుల నుంచి బయటకు పరుగులు తీస్తుండటంతో, అవి జనావాసాల్లోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి.