రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరులో ఈనెల 23వ తేదీన జరగాల్సిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రద్దయింది. ఈ విషయాన్ని వైస్ ఎంపిపి రామిరెడ్డి ధ్వజారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. మళ్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో త్వరలో తెలియజేస్తామన్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కించారు.నెలరోజులకు రూ.4,55,140 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
సర్పంచ్ చెక్ పవర్ రద్దు
పుల్లంపేట: పుల్లంపేట మండలం, జాగువారిపల్లి సర్పంచ్ వై రఘురామయ్య చెక్ పవర్ రద్దు చేస్తున్నట్లు ఏఓ శ్రీధర్రెడ్డి తెలిపారు. జాగువారిపల్లికి సంబంధించి రూ. 7.50 లక్షల నిధుల్లో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ చేపట్టి చెక్ పవర్ రద్దు చేసినట్లు ఏఓ పేర్కొన్నారు.
కురబలకోట ఇన్చార్జి
ఎంపీపీగా భూదేవికి బాధ్యతలు
కురబలకోట: కురబలకోట మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీపీగా నందిరెడ్డిగారిపల్లె ఎంపీటీసీ, వైఎస్ ఎంపీపీ ఎంజి. భూదేవికి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఎంపీపీ బి. దస్తగిరి అనారోగ్య కారణాలతో ఆరునెలలు సెలవులో వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గురువారం మండలంలోని మెజార్టీ ఎంపీటీసీలు సమావేశమై భూదేవిని ఇన్చార్జి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కూడా ఇన్చార్జి ఎంపీపీగా భూదేవికి బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారికంగా మండల పగ్గాలు ఆమె చేతికి వచ్చాయి.
ఏకగ్రీవ ఎన్నిక
రాజంపేట: రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది పచ్చా హనుమంతునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల సీఈవో సురేష్కుమార్, సహాయ ఎన్నికల అధికారి గోవర్ధన్రెడ్డి శుక్రవారం ధ్రు వీకరణపత్రాన్ని అందచేశారు. బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శిగా జాఫర్బాషా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కొండూరు శరత్కుమార్రాజు, న్యాయవాదులు నాసరుద్దీన్, గడికోట రామచంద్రయ్య, రామచంద్రరాజు, నలికిరిరెడ్డయ్య, శంకరనాయుడు, కాశీ, వీవీ రమణ, ప్రభాకరరావు, కత్తి సుబ్బరాయుడు, శ్రీకాంత్, షమీఉల్లాఖాన్, కెఎంఎల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయాన్ని అందరి సహకారంతో అత్యున్నత విద్యాసంస్థగా తీర్చిదిద్దుతామని ఆచార్య ఆల్లం శ్రీనివాసులు పేర్కొన్నారు. నెల్లూరు విక్రం సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆచార్య అల్లం శ్రీనివాసరావు యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జీ వీసీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ కులసచివులు ఆచార్యపుత్తా పద్మ, వైవీయూ కళాశాల ప్రధానాచార్యులు ఎస్. రఘునాథరెడ్డి, ప్రొద్దుటూరు వైవీయూ వైఎస్సార్ ఇంజినీరింగు కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫె సర్ జయరామిరెడ్డి, డీన్లు, బీవోఎస్ ఛైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, స్కాలర్లు విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
● వైవీయూ వీసీ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులతో బేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయ అభివృద్ధికి తన ఆలోచనలను తెలియజేసి సహకరించాలని కోరారు.
వైఎస్ జగన్ పర్యటన రద్దు