పెద్దతిప్పసముద్రం : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, ఏక పక్షంగా వేలంపాట ఎలా నిర్వహిస్తారంటూ కొందరు అధికారులను ప్రశ్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మంతనాల అనంతరం ఈవోఆర్డీ స్పందించి సర్పంచ్, డీఎల్పీవో హాజరుకానందున వాయిదా వేస్తున్నామని చెప్పడంలో పాటదారులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని రంగసముద్రం చెరువులో చేపల పెంపకంపై స్థానిక రాపూరివాండ్లపల్లి సచివాలయం ఎదుట గురువారం వేలంపాట నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఒక రోజు ముందు మాత్రమే చాటింపు వే యడం, ఆశావహులకు డిపాజిట్లు చెల్లింపునకు ఒక రోజు గడువు ఇవ్వడంతో పాటదారుల్లో అసహనం, అ నుమానాలు రేకెత్తాయి. దీంతో వివాదం తలెత్తకుండా అధికారులు పోలీసుల రక్షణ కోరారు. పీటీఎం, ములకలచెరువు ఎస్ఐలు హరిహరప్రసాద్, నరసింహుడు, 5 మంది పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు చేపట్టారు.
వాయిదా వేశామన్న అధికారులు
ధరావతు చెల్లించిన వారు మాత్రమే లోనికి రావాలని చెప్పడంతో గందరగోళం నెలకొంది. వేలం బహిరంగంగా కాకుండా కార్యాలయం లోపల గుట్టుగా వేయడం వెనుక ఆంతర్యం ఏమనే జనం అనుమానాలు వ్యక్తం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 12 గంటలైనా స్థానిక సర్పంచ్, డీఎల్పీవో వేలం పాటకు గైర్హాజరవడం ఇందుకు బలం చేకూర్చింది. దీంతో సచివాలయంలోకి వెళ్ళేందుకు పలువురు గ్రామస్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రజల సూచన మేరకు ఇన్చార్జి ఈవోఆర్డీ మోహన్ ప్రతాప్ను బయటకు రప్పించగా.. నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట ఎలా నిర్వహిస్తారు? వేలంలో పాల్గొనే వారు అధికంగా ఉన్నా డిపాజిట్ కట్టించుకునేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీకు నచ్చిన వాళ్ళ దగ్గరే డబ్బు కట్టించుకుంటారా? అంటూ స్థానికులు గట్టిగా నిలదీసారు. ఎట్టకేలకు స్పందించిన ఈవోఆర్డీ స్పందిస్తూ సర్పంచ్, డీఎల్పీవో హాజరు కానందున వేలంపాట వాయిదా వేస్తున్నామని తెలిపారు. లోపాలు సరిదిద్ది, ముందస్తుగా చాటింపు, కర పత్రాలు, పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేసి వేలం నిర్వహిస్తామని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
డీఎల్పీవో, సర్పంచ్ గైర్హాజరుతో వాయిదా
ఎస్ఐలు, పోలీసుల భారీ బందోబస్తు
ఈవోఆర్డీపై రెండు గ్రామాల ప్రజల ఆగ్రహం