మదనపల్లె : ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. మండలంలోని సాయిబులవారిపల్లెకు చెందిన హుస్సేన్, ఖాదర్బీ దంపతుల కుమారుడు షేక్మౌలా(25) అంగళ్లు చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతడికి భార్య సాదియా, కుమార్తె ఉన్నారు. గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో ఇంటి నుంచి వస్తున్నారు. సిద్దారెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు శ్రీనివాసులు (26) ముదివేడు జాతరకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ముదివేడు క్రాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇరువురి వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో మౌలా తలకు తీవ్రగాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. శ్రీనివాసులు సైతం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మౌలా మృతిచెందగా, శ్రీనివాసులు పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి 108 అంబులెన్స్ వాహనం గంట వరకు రాకపోవడంపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో గాయపడిన వారు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడు మృతి