పీలేరురూరల్ : ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైంది. సీఐ యుగంధర్ కథనం మేరకు.. కాకులారంపల్లె పంచాయతీ కోళ్లఫారానికి చెందిన బెల్లం వెంకటేష్ కుమారుడు సిద్ధరామయ్య(36) ఈ నెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద, గ్రామ పరిసరాల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. రెండు రోజుల క్రితం కుటుంబీకులు పో లీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం గ్రామ సమీపంలోని గురుకుల పాఠశాల ప్రహరీ వద్ద విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ యుగంధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి
తంబళ్లపల్లె : ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లోకేష్రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు... గుండ్లపల్లి పంచాయతీ చెట్లవారిపల్లెకు చెందిన పెద్దవీరభద్ర కుమారుడు నవీన్కుమార్(24) స్థానిక పుడమి కిసాన్ మార్ట్ ఎరువుల దుకాణంలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి పది గంటల వరకు షాపులో ఆడిట్ జరిగింది. అనంతరం షాపు మూసుకుని ఇంటికి చేరాడు. గురువారం ఉదయం 6.30 గంటలకే షాపుకు వచ్చి భవనం వెనుక మెట్ల వద్ద పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. స్థానికులు గమనించే సరికి మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తండ్రి పెద్దవీరభద్ర హుటాహుటిన సంఘటన స్థలం చేరుకుని బోరున విలపించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. తన కుమారుడి మృతిపై పలు అనుమానాలున్నాయని, విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని మృతుడి తండ్రి పోలీసులను వేడుకున్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్.ఐ లోకేష్రెడ్డి తెలిపారు.
అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం
అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యం