పుణ్యఫలాల శుభ రాత్రులు | - | Sakshi
Sakshi News home page

పుణ్యఫలాల శుభ రాత్రులు

Mar 21 2025 12:55 AM | Updated on Mar 21 2025 12:53 AM

నేటి నుంచి తాఖ్‌ రాత్రులు

ప్రత్యేక ఏర్పాట్లలో మసీదు నిర్వాహకులు

ఖురాన్‌ పఠించాలి

రంజాన్‌ మాసంలోని చివరి పది రోజులను తాక్‌ రాత్రులు అంటాం. 21,23, 25,27,29 ఏదైనా ఓ రాత్రి పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్‌ దివి నుంచి భూమిపైకి అవతరిస్తుందని అనేక హదీసులలో, ఖురాన్‌లో పేర్కొన్నారు. ఈ రాత్రులు ఎంతో మహిమ గలవి. ప్రతి ముస్లింలు ఈ రాత్రుల్లో దివ్య ఖురాన్‌ పఠించాలి. ప్రత్యేక నమాజులు ఆచరించాలి.

– ఇక్బాల్‌ అహ్మద్‌, మత గురువు మదనపల్లి

మదనపల్లె సిటీ: పవిత్ర రంజాన్‌ మాసం చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ మాసమంతా మహిమతో కూడినదిగా భావిస్తారు. ఇందులో మొదటి రోజులు అల్లాహ్‌ కరుణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే...రెండవ పది రోజుల్లో తమ తప్పులను క్షమించాలని ప్రార్థిస్తారు. ఇక మూడవదైన ముఖ్యమైన చివరి పదిరోజులు మొదటి రెండు విభాగాల కంటే కొంచెం భిన్నమైనవిగా భావిస్తారు. నరకం నుంచి బయట పడేయాలని అల్లాహ్‌ను శరుణు కోరుకునేందుకు ఈ పదిరోజులను ప్రత్యేకమైనవిగా భావిస్తారు. రంజాన్‌మాస చివరి పది రోజుల్లో పవిత్ర బడీరాత్‌ వస్తుంది. దీన్నే షబ్‌ ఏ ఖదర్‌ లేదా లైలతుల్‌ ఖద్ర్‌ అనికూడా అంటారు. ఈ పవిత్ర రాత్రి చివరి పది రోజుల్లో బేసి రాత్రుల్లో ఉంటుందన్న నమ్మకంతో ముస్లింలు తాఖ్‌ రాత్‌గా నిర్వహిస్తారు. మరీ ముఖ్యంగా 27వ రోజు రాత్రే లైలతుల్‌ ఖద్ర్‌ ఉంటుందని భక్తుల విశ్వాసం. లైలతుల్‌ ఖద్ర్‌ రాత్రి జాగరణ చేసి ప్రార్థనలు చేయడంతో వెయ్యి నెలలపాటు ఉపవాస దీక్షలు చేసినంత ఫలం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. ప్రజల పాపాలను క్షమించాలని కోరుతూ మహమ్మద్‌ ప్రవక్త ప్రార్థించారని పవిత్ర ఖురాన్‌ గ్రంథంలో ఉండడంతో ముస్లింలు జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

● పవిత్ర రంజాన్‌ మాసంలో అత్యంత ముఖ్యమైనవిగా, అధిక పుణ్యాన్ని ఇచ్చే తాఖ్‌ రాత్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని మదనపల్లి, రాయచోటి, రాజంపేట, పీలేరు, రైల్వే కోడూరు, వాల్మీకిపురం, పలు మండల కేంద్రాల్లోని మసీదులలో నిర్వాహకులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వక్తలు, గురువులు తాఖ్‌ రాత్‌లలో అల్లాహ్‌ సందేశాన్ని అందజేసేందుకు రానున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి మొదటి తాఖ్‌ రాత్‌ను ఆచరించనున్నారు. ఆ తర్వాత రోజు విడిచి అంటే ఈనెల 23, 25, 27, 29 తేదీలలో తార్‌ఖాత్‌లను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు తరావీ నమాజు అనంతరం పవిత్ర ఖురాన్‌ పఠనంతోపాటు సామూహికంగా జిక్ర్‌ను చేయించనున్నారు. అలాగే అర్దరాత్రి తహజూద్‌ ప్రార్థనలకువిశేష ఏర్పాట్లు చేశారు. ప్రార్థనల అనంతరం ఐదు రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టే వారికి సెహరి సౌకర్యం కల్పించనున్నారు. దీంతోపాటు శుక్రవారం ముస్లిం భక్తులు మసీదులలో ఎత్తేకాఫ్‌ (తపోనిష్ట) దీక్షలు పాటిస్తారు. వీరు రోజంతా పూర్తిగా ఇతర విషయాల జోలికి వెళ్లకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. రంజాన్‌ పండుగ నిర్వహణకు సూచనగా నెలవంక కనిపించిన తర్వాతనే వారు దీక్ష విరమిస్తారు.

పుణ్యఫలాల శుభ రాత్రులు 1
1/2

పుణ్యఫలాల శుభ రాత్రులు

పుణ్యఫలాల శుభ రాత్రులు 2
2/2

పుణ్యఫలాల శుభ రాత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement